India ships : భారత నౌకాదళ (Indian Navy) శక్తిని, రక్షణ రంగంలో దేశ స్వావలంబనను చాటిచెబుతూ ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) కీలక ముందడుగు వేశారు. కోల్కతా (Kolkata) లోని శ్యామప్రసాద్ ముఖర్జీ (Shyama Prasad Mukherji) పోర్టులో ఈరోజు జరిగిన కార్యక్రమంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన మూడు నౌకలను ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. స్టెల్త్ యుద్ధ నౌక ‘దూనగిరి’, భారీ సర్వే నౌక ‘సంశోధక్’, జలాంతర్గామి విధ్వంసక నౌక ‘అగ్రే’ లను ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. ఈ మూడు నౌకలు యుద్ధ, సర్వే, జలాంతర్గామి నిరోధక కార్యకలాపాల్లో నౌకాదళ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనున్నాయి.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. రక్షణ రంగంలో భారత్ ఇకపై కేవలం కొనుగోలుదారుగా మిగిలిపోదని, మన సైనిక శక్తి ప్రపంచానికి మార్కెట్గా మారకూడదని అన్నారు. మన బలానికి నిర్వచనం ప్రపంచానికి మార్కెట్గా మారడంలో లేదని మన స్వావలంబనలోనే ఉందని చెప్పారు. ఈ మూడు నౌకలు భారత పరిశ్రమల ప్రతిభకు, ఇంజనీర్ల నైపుణ్యానికి, కార్మికుల కఠోర శ్రమకు నిదర్శనమని, ఇదే నవ భారతానికి ఉన్న అతిపెద్ద బలమని ప్రధాని అన్నారు.
కొన్నేళ్ల క్రితం ఐఎన్ఎస్ విక్రాంత్ను జాతికి అంకితం చేసినప్పుడు సముద్ర శక్తిలో భారత్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని గుర్తుచేశారు. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి నేటి వరకు సాగిన ఈ ప్రయాణం కేవలం కొత్త యుద్ధ నౌకలది మాత్రమే కాదని, పెరుగుతున్న భారత స్వావలంబన ప్రయాణం అని ఆయన అభివర్ణించారు. ఏ దేశానికైతే బలమైన సముద్ర శక్తి ఉంటుందో, ఆ దేశానికి బలమైన ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావం ఉంటుందని, ఈ వాస్తవాన్ని భారత్ బాగా అర్థం చేసుకుని, అందుకు తగ్గట్టుగా సిద్ధమవుతోందని మోదీ తెలిపారు.
దూనగిరి పేరుగల నౌక అత్యాధునిక స్టెల్త్ యుద్ధ నౌక. బ్రహ్మోస్ క్షిపణులు, మధ్యశ్రేణి గగనతల క్షిపణి వ్యవస్థ వంటి శక్తిమంతమైన ఆయుధాలు, సెన్సార్లతో దీన్ని తీర్చిదిద్దారు. సుదీర్ఘ సముద్ర కార్యకలాపాలకు అనువుగా, బహుముఖ ఆధిపత్యం ప్రదర్శించేలా దీనిని రూపొందించారు. సంశోధక్ నౌక ఒక భారీ సర్వే నౌక. తీరప్రాంత, లోతైన సముద్ర జలాల్లో హైడ్రోగ్రాఫిక్ సర్వేలు నిర్వహించడానికి, రక్షణ, పౌర అవసరాల కోసం సముద్ర గర్భ డేటాను సేకరించడానికి ఇది ఉపయోగపడుతుంది. అటానమస్ అండర్వాటర్ వెహికల్స్, రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ వంటి అధునాతన వ్యవస్థలు ఇందులో ఉన్నాయి.
ఇక అగ్రే అనే నౌక అర్నాల తరగతికి చెందిన జలాంతర్గామి విధ్వంసక నౌక. తీరప్రాంత జలాల్లో శత్రు జలాంతర్గాములను గుర్తించి, నాశనం చేసేందుకు దీన్ని రూపొందించారు. తేలికపాటి టార్పెడోలు, స్వదేశీ రాకెట్ లాంచర్లు, అత్యాధునిక సోనార్ వ్యవస్థలు దీని ప్రత్యేకతలు. ఈ నౌకల ప్రారంభ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి సువేందు అధికారి, భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ తదితరులు పాల్గొన్నారు.