‘మతం వేరైతేను యేమోయ్ మనసు లొకటై మనుషులుంటే జాతమన్నది లేచి పెరిగి లోకమున రాణించునోయ్ మతములన్నియు మాసిపోవునుజ్ఞానమొక్కటి నిలిచి వెలుగును
మియాపూర్ : అవును.. గురజాడ అన్న మాటలు అక్షర సత్యం. ఏ పేరుతో పిలిచినా సరే అది దేవుడే. అందుకే తరతరాలుగా భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నది మన నగరం. భిన్న సంస్కృతులు.. విభిన్న మతాలు.. ఎనెన్నో సంప్రదాయాలకు నిలయం హైదరాబాద్. ఒకటీ రెండూ కాదు.. ఎన్నో రాష్ర్టాలు, మరెన్నో దేశాల నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారెందరో. అలా ఓ మినీ ఇండియాగా అవతరించిన మహానగరం మత సామరస్యానికి పెట్టింది పేరు. ఏ మతానికి చెందిన వారి పండుగలైనా సరే అందరూ కలిసి జరుపుకోవడం ఇక్కడి ప్రత్యేకత. దాన్ని మరోసారి గుర్తుకు తెస్తూ కులమతాలేవైనా సరే భగవంతుడొక్కడే అని నిరూపిస్తున్నాడో ముస్లిం సోదరుడు. మతాచారం ప్రకారం టోపీ ధరించి నమాజ్ చేస్తూనే. మరోపక్క హిదూ ధర్మాన్ని అత్యంత నిష్టతో ఆచరిస్తున్నాడు. అలా 21 ఏండ్లుగా నిర్విరామంగా అయ్యప్ప దీక్ష స్వీకరిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.
2000 సంవత్సరంలో తొలిసారిగా…
గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కొల్లిపర మండలం దావులూరు గ్రామానికి చెందిన పఠాన్ కాలేశా వృత్తిరీత్యా కార్పెంటర్. 1989లో నగరానికి చేరుకున్న ఆయన ఆల్విన్ కాలనీ డివిజన్లో నివసిస్తూ తన వృత్తిని కొనసాగిస్తూ వచ్చారు. 2000 సంవత్సరంలో భాస్కర్రెడ్డి సహా మరికొందరు స్వాములతో కలిసి తొలిసారిగా పఠాన్ శబరిలోని అయ్యప్ప దేవాలయానికి వెళ్లారు. ఆ ఏడాదే అయ్యప్ప మాల ధరించాలని నిర్ణయించుకుని నవంబర్ 14న మొదటిసారి దీక్ష తీసుకున్నారు. అప్పటి నుంచి 21 ఏండ్లుగా క్రమం తప్పకుండా మాల ధరిస్తూ వస్తున్నారు.
అత్యంత నిష్టతో దీక్ష…
దీక్షా సమయంలో అన్ని నియమాలను అత్యంత క్రమశిక్షణతో పాటిస్తున్నారు పఠాన్. కుటుంబ సభ్యుల సహకారంతో ఇంట్లోనే సన్నిధానం ఏర్పాటు చేసుకుని అయ్యప్ప పూజాదికాలను కొనసాగిస్తున్నారు. 18 ఏండ్లుగా శబరిలోని అయ్యప్ప ఆలయానికి పాదయాత్ర ద్వారా వెళ్తున్నారు. అయ్యప్పకు ఇరుముడి సమర్పించిన తర్వాత స్వగ్రామంలోని తల్లి వద్దకు వెళ్లి ఆమె చేతులమీదుగానే మాల తీయించుకుంటున్నారు. దీక్ష సందర్భంగా మధ్యలో వచ్చే శుక్రవారం నాడు తన సన్నిధానంలోనే టోపీ ధరించి భక్తిశ్రద్ధలతో నమాజ్ పఠిస్తారు. ఈ దీక్ష పూర్తయ్యే వరకు పఠాన్ కుటుంబ సభ్యులు కూడా మాంసాహారానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. దీక్ష పూర్తయిన తర్వాత ఏడాదంతా యథావిధిగా మసీదులకు వెళ్తూ నమాజ్ పఠనాన్ని కొనసాగిస్తూనే ఉంటారు.
అందరికీ బాబాయ్గా సుపరిచితం..
ఆల్విన్ కాలనీ కృష్ణవేణినగర్లో నివాసముంటున్న పఠాన్ కాలేశా స్థానికులందరికీ బాబాయ్గా సుపరిచితులు. స్థానికంగా ఉండే అయ్యప స్వామి ఆలయంలో నిర్వహించే పూజా కార్యక్రమాల్లో కూడా పఠాన్ కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వేరే మతానికి చెందిన వ్యక్తి అయినా.. నిష్టగా దీక్ష చేపట్టడంతో సహచర స్వాములంతా ఆయన్ను ఎంతగానో గౌరవిస్తారు.
నమ్మిన ధర్మాన్ని ఆచరించాలి
దీక్ష తీసుకున్న తొలి ఏడాది కొంత వ్యతిరేకత ఎదురైంది. కానీ ఆ తర్వాత వారు కూడా నన్ను అర్థం చేసుకున్నారు. ఎవరైనా సరే తాము నమ్మిన ధర్మాన్ని ఆచరించాలి. అయ్యప్ప మాలధారణ వల్ల ఎంతో సంతోషంగా ఉంది. ఏ మతమైనా సరే.. దీక్షను నిష్ఠతో ఆచరిస్తూ క్రమశిక్షణతో కొనసాగాలి.