ప్రైమరీ స్కూల్కు రూ.25 లక్షలు
ఉన్నత పాఠశాలకు రూ.కోటి
అవకాశం కల్పించిన ప్రభుత్వం
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): భావి భారత పౌరులను తీర్చిదిద్దే బడుల బాగుకు మనమూ ఓ చేయి వేయవచ్చు. తల్లిదండ్రుల స్మారకంగానో, లేదా కుటుంబ సభ్యుల పేర్ల మీదనో పాఠశాల భవనాలను నిర్మించి ఇవ్వవచ్చు. ఇలా రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు విరాళమిస్తే దాతలు సూచించిన పేరును పెట్టుకోవచ్చు. ఇందుకు ప్రభుత్వ నిబంధనలు అవకాశం కల్పిస్తున్నాయి. విద్యావ్యాప్తితోపాటు, విద్యాసంస్థల నిర్మాణంలో దాతలను భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నది. ఇందు కోసం 2018లోనే జీవోను జారీచేసింది. ప్రాథమిక పాఠశాలలకు రూ.25 లక్షలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.50 లక్షలు, ఉన్నత పాఠశాలలకు రూ.కోటి విరాళంగా అందజేస్తే దాతల పేర్లతో స్కూళ్లను నిర్మించేందుకు అవకాశం కల్పించింది.
విద్యాంజలి ద్వారా
విద్యాంజలి పథకం ద్వారా కూడా విరాళాలు ఇవ్వవచ్చు. ఇందుకు ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ముందుగా స్కూళ్లు, కాలేజీలు విద్యాంజలి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని తమకు ఎలాంటి వసతులు, సామాగ్రి కావాలో వివరించాలి. దాతలు, వలంటీర్లు సైతం ఇదే పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఎలాంటి సేవలు/విరాళాలు అందించనున్నదీ వివరించాలి. వీటిని పరిశీలించాక ప్రధానోపాధ్యాయులు దాతలను సంప్రదించి వారి సేవలను వినియోగించుకొంటారు. మన రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 24 వేల స్కూళ్లు విద్యాంజలిలో రిజిస్ట్రేషన్ చేసుకొన్నాయి.
వీటిని ఇవ్వొచ్చు
తరగతి గదుల నిర్మాణ పనులు, టాయిలెట్లు, ఫ్యాన్లు, జనరేటర్లు, వంట సామాగ్రి, విద్యుత్ ఉపకరణాలు, బోర్డులు, ఫర్నీచర్, సైన్స్, గణితం కిట్లు, కంప్యూటర్లు, ఎల్సీడీ ప్రొజెక్టర్లు, ఇంటరాక్టివ్ వైట్ బోర్డులు, టీవీలు, ల్యాప్టాప్లు, క్రీడా సామాగ్రి, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, వాటర్ ఫ్యూరిఫయర్లు, థర్మామీటర్లు, హ్యాండ్వాష్ సౌకర్యాలు, వీల్చైర్లు, హియరింగ్ ఎయిడ్స్ (వినికిడి ఉపకణాలు) బోధన, అభ్యసన సామగ్రి, మరమ్మతులు, కార్యాలయ అవసరాలకు ఉపకరించే సామాగ్రిని విరాళంగా అందజేయవచ్చు.
పాఠాలూ చెప్పొచ్చు
కేవలం విరాళాలు అందజేయడమే కాకుండా పిల్లలకు పాఠాలు చెప్పడం ద్వారా కూడా బడి ప్రగతికి బాటలు వేయవచ్చు. విద్యాబోధనపై ఆసక్తి గలవారు పాఠశాలకు వెళ్లి విద్యావలంటీర్గా సేవలందించవచ్చు. సబ్జెక్టులనే కాకుండా వృత్తివిద్య, మార్షల్ ఆర్ట్స్, యోగ, పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వొచ్చు. విద్యార్థులను ఆకట్టుకొనేలా కథలు చెప్పవచ్చు. వికలాంగులకు ఫిజియో థెరపీ చేయవచ్చు. ఇందుకుగాను ఎలాంటి పారితోషికం, వేతనాలను ఇవ్వరు.