యాదాద్రి, జనవరి 2: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ పునర్నిర్మాణంలో పలువురు ప్రముఖులు భాగస్వాములవుతున్నారు. ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి ప్రజలు విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ పిలుపుతో అనేక మంది స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఇందులోభాగంగా ఆదివారం రూ.3.06 కోట్ల విరాళాలు అందాయి. నమస్తే తెలంగాణ దినపత్రిక సీఎండీ దీవకొండ దామోదర్రావు రూ.50 లక్షల చెక్కును యాదాద్రి బాలాలయంలో ఈవో ఎన్ గీతకు అందజేశారు. హెటిరో డ్రగ్స్ లిమిటెడ్ తరఫున రూ.50 లక్షలు, హెటిరో గ్రూప్ నుంచి రూ.50 లక్షలు, హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్ తరఫున రూ.50 లక్షలతోపాటు హెటిరో డ్రగ్స్ అధినేత డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి మరో రూ.50 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. హానర్ ల్యాబ్స్ లిమిటెడ్ తరఫున ఆ సంస్థ ప్రతినిధులు రూ.50 లక్షల చెక్కు ఇచ్చారు. అంతకుముందు వారు యాదాద్రీశుడిని దర్శించుకొని పూజలు చేశారు. వారికి ఆలయ ఈవో స్వామివారి ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాదాద్రి పునర్నిర్మాణంలో భాగస్వాములం కావడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా యాదాద్రి ఆలయాన్ని పూర్తిగా కృష్ణశిలలతో నిర్మించడం గొప్ప విషయమని కొనియాడారు. ఆలయ పునర్నిర్మాణంలో భక్తులను సైతం భాగస్వాములను చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం సిద్ధిస్తుందని, ముఖ్యమంత్రి చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. కరీంనగర్లోని చల్మెడ ఆనందరావు వైద్యకళాశాల చైర్మన్, టీఆర్ఎస్ నాయకుడు చల్మెడ లక్ష్మీనర్సింహారావు రూ.5 లక్షల విరాళం అందజేశారు. యా దాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు చెందిన కాదూరి అచ్చయ్య స్వామివారికి రూ.1.51 లక్షల విరాళం సమర్పించారు.
నగలు సమర్పించిన మంత్రి సత్యవతి
గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ లక్ష్మీనర్సింహ స్వామివారిని దర్శించుకొన్నారు. తన బంగారు నగలను భక్తితో స్వామివారికి నిలువు దోపిడీ సమర్పించారు. త్వరలో మరింత విరాళం సేకరించి స్వామివారికి అందజేస్తామని చెప్పారు. బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు మరింత శక్తిని ఇవ్వాలని, మరిన్ని సంక్షేమ పథకాలు అమలుచేసే విధంగా చల్లగా చూడాలని స్వామివారిని కోరుకున్నట్టు ఆమె తెలిపారు.