నీలగిరి, అక్టోబర్ 30 : నల్లగొండ మున్సిపల్ సాధారణ పరిపాలన సమావేశం వాడీవేడిగా సాగింది. చైర్మన్ మందడి సైదిరెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో పలు సమస్యలపై సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. పట్టణంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో ఎమ్మెల్యే నిర్లక్ష్యం చూపుతున్నారని బీజేపీ సభ్యులు ఆరోపించగా టీఆర్ఎస్ కౌన్సిలర్ పిల్లి రామారాజు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ పాలకవర్గం ఏర్పడ్డాక రాజకీయాలకు అతీతంగా అన్ని వార్డులకు సమానంగా లక్షలాది రుపాయలు నిధులు కేటాయిస్తున్న ట్లు తెలిపారు. అంతేగాకుండా ఎల్ఆర్ఎస్ నిధులు ప్రతీ వార్డుకు రూ.25లక్షలు ఎమ్మెల్యే రాజకీయాలకు అతీతంగా అన్ని వార్డులకు ఇస్తే కౌన్సిలర్లు తమకు నచ్చిన చోట ప్రతిపాదనలు పెట్టి ఇప్పుడు ఎమ్మెల్యేపై బురదజల్లే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. గత పాలకులు కాంట్రాక్టుల కోసం యుజీడీ పనులను ఇష్టానుసారంగా అసంపూర్తిగా చేశారని, తెలంగాణ ప్రభుత్వం అధికారం లోకొచ్చాక పెండింగ్ పనుల కోసం ఎమ్మెల్యే రూ.18కోట్లు మంజూరు చేయించారన్నారు. దీనికి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్రెడ్డి కలుగజేసుకుని అప్పటి పాలకవర్గ సభ్యులు కేటాయించిన దానికంటే అధికంగా డ్రైనేజీ పనులు చేయించుకోవడం వల్లే పనులు అసంపూర్తి అయ్యాయన్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్లు కలుగజేసుకుని శాంతపరిచారు. రాజకీయాలకు అతీతంగా పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని, రాజకీయ విమర్శలకు తావు ఇవ్వవద్దని కోరారు.
వీధి కుక్కల నివారణ ఖర్చు రూ.15లక్షలా..?
పట్టణంలో కుక్కల నివారణకు చేసిన ఖర్చుపై మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తంచేశారు. వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్న రూ.15లక్షలు ఎలా చెల్లిస్తారని నిలదీశారు. పట్టణంలో కుక్కల నివారణకు చెల్లించాల్సిన బిల్లులో తేడాలున్నాయని వాటిని నిలిపివేయాలని సూచించారు. మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు, అధికారులకు, సిబ్బందికి తెలియకుండా చేయని పనులను చేసినట్లుగా ఇష్టనుసారంగా బిల్లులు వేసుకుంటూ పోతే ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. పలువురు సభ్యులు మాట్లాడుతూ కార్యాలయంలో చాలాకాలంగా తిష్టవేసిన పారిశుధ్య కార్మికులను బయటకు పంపించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీకి సంబందించిన లీజు బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పట్టణంలో రోడ్లకు మరమ్మతులు చేయించాలని సూచించారు. వ్యర్థాలను తరలించే వాహనాల మరమ్మతుకు చొరవ తీసుకోవాలని తెలిపారు. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనులు పెండింగ్లో ఉండడం వల్ల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని పలువురు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తంచేశారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు చైర్మన్ మందడి సైదిరెడ్డి అధికారుల నుంచి సమాధానం చెప్పించారు.
ప్రతినెలా మున్సిపాలిటీకి రూ.కోటి ఖర్చు
ఈ సందర్భంగా చైర్మన్ సైదిరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో రోజురోజుకు కాలనీలు, గృహాలు పెరిగిపోతున్నందున వాటి మౌలిక సదుపాయల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. మున్సిపాలిటీకి కరెంటు బిల్లులు, కార్మికుల వేతనాలు, వాహనాల డీజిల్కు సుమారు కోటి రుపాయల వరకు ఖర్చు అవుతుండగా, పన్నులు ఆశించిన మేరకు వసూలు కావడం లేదన్నారు. కౌన్సిలర్లు, అధికారులు సమన్వయంతో ఆస్తి, మంచినీటి పన్నులు వసూలు చేయాలన్నారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ పెండింగ్ పనులు పూర్తి చేసేలా కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రమేశ్, ఇన్చార్జి కమిషనర్ శ్రీనివాస్, మేనేజర్ కిరణ్కుమార్, ఫ్లోర్ లీడర్లు, కౌన్సిలర్లు మారగోని భవానీగణేశ్, అలకుంట్ల రాజేశ్వరీమోహన్బాబు, బోజ్జా మల్లికానాగరాజు, బోయినపల్లి శ్రీనివాస్, సమీ, ఖయ్యుంబేగ్, యామ కవితారాణి, లక్ష్మమ్మ, ఊట్కూరి వెంకట్రెడ్డి, కోఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ, జమాల్ఖాద్రి, తేజశ్రీ, రాధిక పాల్గొన్నారు.