విద్యా వ్యవస్థ గాడిన పడుతున్నది. 16 నెలల తర్వాత ప్రత్యక్ష బోధన ప్రారంభమైన పాఠశాలలకు పిల్లలను పంపాలంటే తల్లిదండ్రులు తొలుత ఆందోళన చెందినా.. ప్రభుత్వం, ద్యాశాఖాధికారులు తీసుకున్న జాగ్రత్తలతో ఊపిరి పీల్చుకున్నారు. దసరా తర్వాత విద్యాసంస్థల్లో మునుపటి వాతావరణం కనిపిస్తున్నది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో 65 నుంచి 79 శాతం హాజరు నమోదవుతున్నది. గురుకుల విద్యాసంస్థలకూ విద్యార్థుల రాక మొదలైంది. నాలుగో తరగతిలోపు పిల్లలను మాత్రం బడికి పంపేందుకు ఎక్కువమంది పేరెంట్స్ ఆసక్తి చూపడం లేదు. గతంతో పోలిస్తే ప్రైవేట్లో అడ్మిషన్లు తగ్గాయి. హాస్టళ్లు కూడా విద్యార్థుల్లేక బోసిబోయి కనిపిస్తున్నాయి. నవంబర్ మొదటి వారంలో విద్యార్థుల హాజరు నూరు శాతానికి చేరుకునే అవకాశముందని విద్యాఖాధికారులు అభిప్రాయ పడుతున్నారు.కరోనా కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2020 మార్చిలో సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది. వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో 2021 ఫిబ్రవరి 1న ప్రత్యక్ష బోధన ప్రారంభించింది. పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు ముందుకు రాకపోవడంతో ఆన్లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి. బోధన, బోధనేతర సిబ్బందికి వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంతోపాటు, వైరస్ వ్యాప్తి అదుపులోకి రావడంతో సెప్టెంబర్ 1న పాఠశాలలు, కళాశాలలు
పునఃప్రారంభమయ్యాయి.
22నుంచి 79శాతానికి పెరిగిన హాజరు..
ప్రత్యక్ష బోధన ప్రారంభించిన సెప్టెంబర్ తొలి వారంలో హాజరుశాతం అతి తక్కువగా 22 నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,213 (నల్లగొండ2,025, సూర్యాపేట 1,279, యాదాద్రి 909) పాఠశాలలు ఉండగా ప్రభుత్వ పాఠశాలల్లో 20నుంచి 25శాతం, ప్రైవేటులో 16నుంచి 17శాతం హాజరు నమోదైంది. ఈ నెల 28నాటికి 65నుంచి 79శాతానికి పెరిగింది.
ఉమ్మడి జిల్లాలో పెరిగిన అడ్మిషన్లు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది 40,204 అడ్మిషన్లు కొత్తగా నమోదయ్యాయి. వీటిలో నల్లగొండ జిల్లాలో 17,682, సూర్యాపేటలో 14,046, యాదాద్రి జిల్లాలో 8,476 అడ్మిషన్లు ఉన్నాయి. మూడో తరగతి లోపు చిన్నారులను బడికి పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. ఫీజుల భారానికి తోడు చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా వారిని ఇంటికే పరిమితం చేశారు.
కళాశాలల్లో ప్రత్యక్ష బోధన..
ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలతోపాటు మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ప్రత్యక్ష బోధన కొనసాగుతున్నది. ఆగస్టు 26నుంచి పాఠశాలల్లో, కళాశాలల్లో, యూనివర్సిటీలో సెప్టెంబర్ 1న తరగతులు ప్రారంభం కాగా విద్యార్థులంతా కరోనా నిబంధనలు పాటిస్తూ హాజరవుతున్నారు.
ఫలితమిచ్చిన పకడ్బందీ చర్యలు
కరోనా వ్యాక్సినేషన్ను వేగవంతం చేసిన ప్రభుత్వం ముందుగా పాఠశాల, కళాశాలల బోధన, బోధనేతర సిబ్బందికి టీకాలు వేయించింది. పాఠశాలలను శానిటైజ్ చేయించడంతో పాటు మార్గదర్శకాలు విడుదల చేసింది. తొలి, రెండో విడుత వ్యాక్సిన్ పూర్తి కావడంతో కరోనా కేసుల వ్యాప్తికి చెక్పడింది. పాఠశాలల ప్రారంభంలో రెండు చోట్ల తప్ప.. పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ఇటీవల హాస్టళ్లు సైతం తెరుచుకోవడంతో ఇప్పుడిప్పుడే సందడి నెలకొంది.
ఇప్పుడిప్పుడే బడికి పంపుతున్నరు..
ఆన్లైన్ పాఠాలను విద్యార్థులు పూర్తిస్థాయిలో అర్థం చేసుకోలేకపోయారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చాలా మంది విద్యకు దూరమయ్యారు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న తరుణంలో ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యే విద్యార్థుల శాతం క్రమంగా పెరుగుతున్నది. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలు బడికి, చదువులకు దూరం కావద్దనే ఆలోచనతో పాఠశాలలకు పంపిస్తున్నారు.
స్కూలుకు పంపుతున్నాం
కరోనా కారణంగా పిల్లలు ఇంటి దగ్గర ఉండి చదువు మర్చిపోయారు. ఈ మధ్య బడి తెరవడంతో తిరిగి పంపించడానికి మేము వెనుకాడినం. రెండు నెలలుగా ఎలాంటి ఇబ్బందులు లేకపోగా, మేము ప్రత్యక్షంగా బడికి వెళ్లి చూసిన తర్వాతనే పిల్లలను స్కూలుకు పంపిస్తున్నాం. మాస్కు, శానిటైజర్ ఇస్తున్నాం. రోజూ బడికి వెళ్తుండడంతో ఆట, పాటలు, అల్లరి తగ్గిపోయి క్రమశిక్షణ పెరిగింది.
బడికి పోతుంటే సంతోషంగా ఉంది..
చాలా రోజుల తర్వాత బడికి పోతుంటే సంతోషంగా ఉంది. బడి తెరువగానే పంపించేందుకు మా అమ్మానాన్న ఒప్పుకోలేదు. మా స్కూల్ సారు వాళ్లు ఇంటికి వచ్చి ఎలాంటి ఇబ్బందీ లేదని చెప్పడంతో బడికి పంపిస్తున్నరు. ఎవరైనా మాస్కు తెచ్చుకోకపోతే మా హెడ్ మాస్టర్ సార్ కొత్త మాస్కు ఇచ్చి లోపలికి రానిస్తున్నారు.
తల్లిదండ్రులకు అవగాహన..
స్కూళ్లు పునఃప్రారంభించిన తర్వాత విద్యార్థుల ఇండ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం. మాస్కులు పెట్టి పంపించాలని, శానిటైజర్ ఇవ్వాలని, మంచినీళ్ల బాటిళ్లు తెచ్చుకోవాలని చెప్పాం. సెప్టెంబర్ 1న 25శాతం పిల్లలు వస్తే.. ప్రస్తుతం 75శాతం మంది వస్తున్నారు. నిత్యం పాఠశాలను శానిటైజేషన్ చేయిస్తున్నాం.
కరోనాపై భయం తొలిగేలా యోగా, క్రీడలు
విద్యార్థులు రోజూ యోగా, వ్యాయామం, క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నాం. సుమారు ఏడాదిన్నర పాటు బడికి దూరంగా గడపడంతో పాఠాలు వినేందుకు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గమనించి పాఠశాల, చదువుపై ఆసక్తి పెంచేలా యోగా, వ్యాయామంతోపాటు ఆటలు ఆడిస్తున్నాం. ప్రధానోపాధ్యాయుల సూచనలు, సలహాల మేరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
దూర ప్రాంతాల నుంచి తక్కువ
లాక్డౌన్ సమయంలో విద్యార్థులు చదువుకు దూరం కావొద్దని ఆన్లైన్ తరగతులు నిర్వహించాం. రెండు నెలలుగా ప్రత్యక్ష తరగతులు కొనసాగుతున్నా హాజరు శాతం పెరుగడం లేదు. దూర ప్రాంతాల నుంచి తక్కువగా వస్తుండడంతో స్కూల్ బస్సుల నిర్వహణ కూడా ఇబ్బందిగానే ఉంది.