నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్లలో ఎదురయ్యే ఇబ్బందులను ముందే అంచనా వేస్తూ వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు ఆదేశించింది. రైతులు సాధ్యమైనంత వరకు ఇబ్బందులు పడకుండా చూడాలని ఇప్పటికే స్పష్టంగా పేర్కొనడంతో జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఆటంకాలను ముందే అంచనా వేస్తూ మంత్రి జగదీశ్రెడ్డి పర్యవేక్షణలో కార్యాచరణ సిద్ధం చేసింది. కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీని నియంత్రించేందుకు తొలిదశలో పలు చర్యలకు ఉపక్రమించింది. ఒకేసారి కేంద్రాలు లేదా మిల్లుల వద్దకు ధాన్యాన్ని తీసుకురాకుండా వరి కోతలకు విరామం ఇవ్వాలని భావిస్తున్నది. వారంలో రెండ్రోజుల పాటు కోతలు బంద్ చేయాలని రైతులకు విజ్ఞప్తి చేయడంతోపాటు హార్వెస్టర్ యజమానులకు ఆదేశాలిచ్చింది. వరి కోతల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది. అందులో వ్యవసాయ శాఖతోపాటు రెవెన్యూ, పోలీస్, మార్కెటింగ్ శాఖలతో పాటు రైస్ మిల్లర్లు, ట్రాక్టర్ యజమానులు, రైతులను భాగస్వాములను చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు గురువారం సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
వరి కోతలపై నియంత్రణ
24గంటల పాటు వరి కోతలు కోయడం వల్ల ధాన్యం అంతా ఒకేసారి రైస్మిల్లులు లేదా కొనుగోలు కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున రానుంది. దీంతో కొనుగోళ్లు సైతం అంతే వేగంగా చేపట్టడం అంతా సులువు కాదు. ఈ నేపథ్యంలోనే వరికోతలపై నియంత్రణ పాటించాలని నిర్ణయించారు. వారంలో రెండు రోజుల పాటు వరి కోతలు వద్దని అధికారులు నిర్ణయించారు. దాన్ని నేటి నుంచే అమలు చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ వారంలో ఈ నెల 29, 31వ తేదీన వరి కోతలు చేయకూడదని స్పష్టం చేశారు. వచ్చే వారం నుంచి ప్రతీ గురు, ఆదివారాల్లో కోతలు పూర్తిగా నిషేధించాలని భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కొంత వెసులుబాటు లభించనుండడంతో కేంద్రాల వద్ద రద్దీ తగ్గడంతో పాటు ధాన్యాన్ని వేగంగా కాంటా వేయడం సులువు అవుతుందని పేర్కొంటున్నారు. ఈ మేరకు ప్రత్యేకంగా వరి కోతలు కోసే హార్వెస్టర్ యజమానులతో సమావేశం పెట్టి కోతలు చేయవద్దని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా కోతలు కోస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. హార్వెస్టర్ యజమానులందరికీ క్షేత్రస్థాయిలోని వ్యవసాయ, పోలీసు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు.
నాణ్యతలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి
ధాన్యం నాణ్యత విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు ధాన్యం కోసి నేరుగా కేంద్రాలకు తేవడం వల్ల తేమ, ఇతర ఇబ్బందులతో మద్దతు ధర ఇబ్బంది అవుతుందని పేర్కొంటున్నారు. అందుకే రైతులు వరి కోతలు కోశాక ధాన్యాన్ని ఆరబెట్టుకుని తేవాలని సూచిస్తున్నారు. దీంతో పాటు హార్వెస్టర్ యజమానులకు సైతం ప్రత్యేకంగా సూచనలు చేస్తున్నారు. కోతల సమయంలో బ్లోయర్లు తప్పనిసరిగా వాడాలని ఆదేశాలు జారీ చేశారు. బ్లోయర్లు ఉపయోగించడం వల్ల ధాన్యంలోని తాలు, మట్టిపెళ్లల పరిమాణం తగ్గి నాణ్యమైన ధాన్యం వస్తుందని సూచిస్తున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు లేకుండా వెంటవెంటనే పూర్తికి అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. సన్నరకం ధాన్యానికి సాధారణంగా బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉంటుందని, అలా లేని సమయంలో నిర్ణీత ప్రమాణాలతో ధాన్యాన్ని తెస్తే ప్రభుత్వ మద్దతు ధరైనా లభిస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ సీజన్లో భారీగా దిగుబడి రానున్న నేపథ్యంలో ఇందులో రైతులతో పాటు అందరి సహకారం అవసరమని విజ్ఞప్తి చేస్తున్నారు.
రైస్మిల్లర్లు సహకరించేలా…
కొనుగోళ్ల విషయంలో జిల్లా రైస్మిల్లర్ల సహకారం చాలా కీలకం. ఈ సారి ఎక్కువగా ధాన్యం నేరుగా రైస్మిల్లుల వద్దకే వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వారితోనూ అధికారులు ప్రత్యేకంగా సమీక్షలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో నాణ్యతా ప్రమాణాల మేరకు సరైన ధర చెల్లించాలని స్పష్టం చేశారు. తప్పుడు పద్ధతులతో రైతులను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సారి సైతం గతంలో లాగా రైతులకు ముందే టోకెన్లు జారీ చేయడం వల్ల కొనుగోలు కేంద్రాల రద్దీని నియంత్రించాలని అధికారులు నిర్ణయించారు. రైతులకు కూడా సమయంతో పాటు వృథా ఖర్చులు తగ్గుతాయని సూచిస్తున్నారు. వ్యవసాయశాఖ, పోలీసు, రెవెన్యూ శాఖల భాగస్వామ్యంతో టోకెన్ల జారీ చేపట్టాలని నిర్ణయించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ట్రాన్స్పోర్ట్, నిల్వ చేయడం, మిల్లింగ్ లాంటి అన్ని విషయాలపైనా అధికార యంత్రాంగం దృష్టి సారించింది.