నల్లగొండ, అక్టోబర్ 26 : యాసంగి సీజన్లో కేంద్ర ప్రభుత్వం ఒక్క గింజ కూడా కొనే పరిస్థితి లేనందున రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. వానకాలం ధాన్యం కొనుగోలు, యాసంగి ప్రణాళికపై మంత్రి మంగళవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రత్యామ్నాయ పంటల్లో మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి రకాలను సాగు చేసేలా రైతులకు అవగాహన పరచాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్సీఐ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో గత సీజన్లో నిల్వలు మిగిలి పోయినట్లు తెలిపారు. ఈ సారి రాష్ట్రం మొత్తంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కానుండగా ఎఫ్సీఐ 24 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పిందని, మరో 36లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్రంలోనే అదనంగా నిల్వ ఉండాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. గత సీజన్లో వరి సాగు చేయెద్దని ప్రభుత్వం చెప్పనందున బాధ్యతతో పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. యాసంగి సీజన్లోనూ ధాన్యం కొనుగోలు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీకి విన్నవించినా హామీ ఇవ్వలేదని ఈ సందర్భంగా వివరించారు. ఈ నేపథ్యంలో రైతులు వరి సాగు చేస్తే మార్కెట్ లేక నష్ట పోయే ప్రమాదం ఉన్నందున మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి కంది, పెసర, నువ్వులు, మినుములు, వేరుశనగ, ఆముదం లాంటి పంటలు సాగు చేయాలని సూచించారు. ఈ పంటలకు సైతం సాగునీరు అందుతున్నందున మంచి దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. వేరు శనగతో పాటు నువ్వులు, ఆవాలు, ఆయిల్పామ్ సాగు చేస్తే మంచి దిగుబడితో పాటు లాభాలు కూడా ఉంటాయని చెప్పారు. ఏటా 80వేల కోట్ల విలువైన ఆయిల్ ఉత్పత్తులను మలేషియా లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. వానకాలంలో పత్తి సాగు చేసిన రైతులు ఆ పంటను తొలగించకుండా తడి ఇస్తే మరింత దిగుబడి వస్తుందని సూచించారు. వ్యవసాయ అధికారులు అన్ని గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి రైతులను అవగాహన పరిచి ఏఏ ప్రాంతాల్లో ఏఏ పంటలు వేస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశించారు. వానకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 183 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 5.83లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని మార్కెట్కు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని కోరారు. గతంలో దేశానికే అన్నం పెట్టిన పంజాబ్ లాంటి రాష్ట్రం సైతం వానకాలంలో మాత్రమే వరి సాగు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మరో ఏడెనిమిది రాష్ర్టాల్లోనూ వరి సాగు చేస్తున్నందునే ఈ సమస్య ఏర్పడిందన్నారు. సమావేశంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ కలెక్టర్ అపూర్వ్ చౌహాన్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, నల్లమోతు భాస్కర్రావు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంచంద్రనాయక్, మున్సిపల్ కమిషనర్ మందడి సైదిరెడ్డి, జేడీఏ శ్రీధర్ రెడ్డి, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, బొర్ర సుధాకర్ పాల్గొన్నారు.