రాజాపేట మండలంలో భారీగా ఈత వనాలు
రాజాపేట, అక్టోబర్ 31 : శీతాకాలం వచ్చిందంటే చాలు.. గ్రామీణ ప్రాంతాల్లో పొద్దునే లేచి పరిగడుపున తాగేందుకు ఈత కల్లు రెడీగా ఉంటుంది. ఇది ఎంతో మాధుర్యాన్ని కలిగి ఉండి మంచి అనుభూతినిచ్చే ప్రకృతి పానీయం. రోజూ ఉదయాన్నే సేవించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రజలు నమ్ముతారు. దీన్ని సేవించేందుకు ఎంతో మంది ఆసక్తి కనబరుస్తారు. రాజాపేట మండలంలోని పాముకుంట, నర్సాపూరం, సింగారం, సోమారం కొత్తజాల తదితర గ్రామాల్లో ఈత వనాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఇక్కడ సుమారు 60 మంది గీత కార్మికులు కల్లు విక్రయించి ఉపాధి పొందుతున్నారు. లీటర్కు రూ.50 చొప్పున రోజూ 500 లీటర్లకు పైగా విక్రయించి ఆదాయం పొందుతున్నారు.
శీతాకాలంలో భలే గిరాకీ
శీతాకాలం వచ్చిందంటే చాలు ఈత కల్లుకు భలే గిరాకీ ఉంటుంది. గ్రామీణులతోపాటు పట్నం వాసులూ దీన్ని సేవించేందుకు అమితంగా ఇష్టపడుతారు. పట్నం నుంచి పల్లెకు వస్తే చాలు ఈతకల్లు తాగనిదే వెనుదిరుగరు. ప్రకృతి వరప్రసాదినిగా పేరుగాంచిన ఈ కల్లులో ఎన్నో ఔషధ గుణాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని సేవిస్తే ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలుంటాయని పేర్కొంటున్నారు.
కల్లు తాగేందుకు ఎంతోమంది వస్తుండ్రు
చిన్నా, పెద్దా తేడా లేకుండా ఈతకల్లును తాగేందుకు ఇష్టపడుతారు. పొద్దున్నే తీసే దీన్ని తాగేందుకు మక్కువ చూపుతారు. తక్కువ ధరకే లభిస్తుండడంతో వివిధ గ్రామాల నుంచి ఎంతో మంది వస్తుంటారు. రోజూ 15నుంచి 20 లీటర్లు విక్రయిస్తాను. శీతాకాలంలో నెలకు రూ.20 వేల నుంచి రూ.30వేలు సంపాదిస్తా.
-చిక్క వెంకటేశ్, గీతకార్మికుడు, పాముకుంట
ఈతకల్లు అంటే ఇష్టం
మద్యం సేవిస్తే ఎంతో హాని కలుగుతుంది. కానీ, చౌకగా లభించే ఈతకల్లు ఔషధంగా పనిచేస్తుంది. చిన్నప్పటి నుంచి ఈతకల్లు తాగే అలవాటు ఉంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈతకల్లును శీతాకాలంలో ఉదయాన్నే సేవిస్తుంటాం.