నీలగిరి, అక్ట్టోబర్ 31, ఉమ్మడి నల్లగొండ జిల్లా వైద్య చరిత్రలో మరో మైలురాయిని జిల్లా ప్రజలకు అందించినట్లు నల్లగొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్(నిమ్స్) వైద్యులు తెలిపారు. జిల్లా వైద్య చరిత్రలో తొలిసారిగా పది మంది గుండె రోగులకు యాంజియోగ్రామ్ను విజయవంతంగా చేసినట్లు చెప్పారు. ఆదివారం నిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ శరత్చంద్ర మాట్లాడుతూ.. వైద్యపరంగా నల్లగొండ జిల్లాలో గుండె సంబంధిత కేసులను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి గుండెపోటు వచ్చి హైదరాబాద్కు వెళ్లే సమయం లేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఇక నుంచి హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే నిమ్స్లో వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ఓపెన్ బైపాస్ సర్జరీలు, ఇతర గుండె సంబంధ అన్ని రకాల ఆపరేషన్లు చేయనున్నట్లు వెల్లడించారు. చాలా మంది చిన్నారుల నుంచి పెద్దల వరకు గుండె సంబంధ రోగాలతో బాధపడుతూ హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లి ఇబ్బందులు పడడంతోపాటు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. కేవలం రూ.7,500కే యాంజియోగ్రామ్ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు చెందిన వైద్యులుగా ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వైద్యసేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో వైద్యులు ఎన్.సాయికృష్ణారెడ్డి, రవీందర్రెడ్డి, పి.వెంకట్రెడ్డి, రాజేశ్రెడ్డి, విజయ్కుమార్, వైవీ రాజశేఖర్రెడ్డి, సీఈఓ వీరారెడ్డి, పీఆర్ఓ అజయ్కుమార్, మేనేజర్ మోత్కూరు శ్రీనివాస్ పాల్గొన్నారు.