విద్యార్థులకు చదువుతో పాటు కళలు, నైపుణ్యాలపై ఆసక్తి పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆ దిశగా హైస్కూల్స్లో 8నుంచి 10వ తరగతి విద్యార్థుల్లో ఆయా అంశాల బోధనకు నియామకమైన ‘పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ల’ను తిరిగి విధుల్లోకి 2021-22 విద్యా సంవత్సరానికి తీసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో కరోనా ముందు మూలనపడ్డ దస్ర్తాలను జిల్లా విద్యాశాఖాధికారులు సిద్ధం చేస్తుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 402మందికి ఉపాధి కలగనుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పార్ట్టైం ఇన్స్ట్రక్టర్లకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న వీరిని తిరిగి 2021-22 విద్యా సంవత్సరానికి తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆయా జిల్లా కలెక్టర్ల ఆమోదంతో జిల్లా విద్యాశాఖ దస్త్రం సిద్ధం చేస్తుండగా వచ్చే వారంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 402మంది ఉపాధ్యాయులు విధుల్లోకి చేరనున్నారు. ఈ విషయంలో అన్ని మండలాల్లో ఏ పాఠశాలలో ఎవరు పని చేస్తున్నారనే వివరాలు సేకరించి ఫైల్ సిద్ధం చేస్తున్నట్లు నల్లగొండ డీఈవో బి.భిక్షపతి ‘నమస్తే తెలంగాణ’ పలకరించగా వెల్లడించారు. నల్లగొండలోని మొత్తం 160 మంది ఉండగా వీరిలో 60మంది ఆర్ట్, 85మంది వర్క్ ఎడ్యుకేటర్స్, 15మంది పీఈటీలు ఉన్నారు.సూర్యాపేట జిల్లాలో మొత్తం 170 మంది ఉండగా వీరిలో 61మంది ఆర్ట్ , 89మంది వర్క్ ఎడ్యుకేటర్స్, 20మంది పీఈటీలు ఉన్నారు.యాదాద్రిభువనగిరి జిల్లాలో 72మంది ఉండగా వీరిలో 24మంది ఆర్ట్, 46మంది వర్క్ ఎడ్యుకేటర్స్, 02 పీఈటీలు ఉన్నారు.
ప్రత్యక్ష తరగతుల ప్రారంభంతో చేరిక
ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు భారీగా పెరగడంతో పాటు విద్యతోపాటు ఆర్ట్, వర్క్ ఎడ్యుకేషన్ను సైతం విద్యార్థులకు అందించేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. దీంతో ఆయా అంశాలు బోధించే ఉపాధ్యాయలను విధుల్లోకి తీసుకోనుంది. కరోనా నేపథ్యంలో మార్చి 2020 నుంచి వీరిని విధుల్లో నుంచి తొలగించారు. తిరిగి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కావడంతో విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకుంది.
కలెక్టర్ల ఆమోదంతో విధుల్లోకి
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా జిల్లాల డీఈఓలు 2019-20 విద్యా సంవత్సరంలో ఎంతమంది పనిచేశారనే సమాచారాన్ని ఎంఈఓలతో సమాచారం తీసుకుంటున్నారు. అనంతరం వారికి సంబంధించిన దస్త్రాలను కలెక్టర్ ఆమోదంతో విధుల్లోకి తీసుకోనున్నారు. అయితే వచ్చే వారం ఈ ప్రక్రియ పూర్తి అయితే అంతటా పార్ట్టైం ఇన్స్ట్రక్టర్లు విధుల్లోకి రానున్నారు. దీంతో 16నెలలుగా వేతనాలు లేక ఇబ్బందుల్లో ఉన్న వారిలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.