దామరచర్ల, డిసెంబర్ 4 : కృష్ణానది తీరంలో నిఘా లేకపోడంతో అక్రమ దందాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ రవాణాతో పాటు పీడీఎస్ బియ్యం వ్యాపారానికి కృష్ణపట్టె కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. మరోవైపు నదీతీరంలో అందంగా పొదిగి ఉన్న గుండ్రాళ్లను ఇతర ప్రాంతాలకు గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దామరచర్ల మండలంలోని కృష్ణానది తీరంలోని ఇర్కిగూడెం గ్రామంలో కొంత మంది ఈ దందాను కొనసాగిస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. దీనితో పాటుగా నల్లమట్టి, రెడ్గ్రావెల్, నాపరాయి తవ్వకాలు జరుపుతున్నారు. నది ఒడ్డున నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈ దందా నిరాటంకంగా కొనసాగుతున్నది. ఏ నది తీరంలోనూ కనిపించని చూడముచ్చటైన నున్నటి గుండ్రాళ్లు మన రాష్ట్రంతో పాటుగా ఇతర రాష్ర్టాల్లో మంచి గిరాకీ ఉండటంతో అదేపనిగా దందాను కొనసాగిస్తున్నారు. వారానికి పది లారీలపైగానే లోడ్లను ఎగుమతి చేస్తున్నారు. నదీ తీరంలో కూలీలను పెట్టి రాళ్లను తొలగించి పక్కనే నిల్వ చేస్తున్నా పట్టింపు కొరవడింది.
జోరుగా వ్యాపారం..
కృష్ణానదిలో నునుపుగా, గుండ్రంగా కనిపించే గుండ్రాళ్లకు మంచి ఆదరణ, గిరాకీ ఉన్నది. టన్ను ధర పదివేల రూపాయల వరకు పలుకుతుంది. లారీలో 20 టన్నుల వరకు రాయిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఇతర రాష్ర్టాల్లోని ప్రధాన పట్టణాలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి మార్కెట్ ద్వారా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. వారానికి పది లారీల గుండ్రాళ్లను ఎగుమతి చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా, ఇష్టారాజ్యంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
సైజు, రంగు మేరకు రాళ్ల ధర వేర్వేరుగా ఉంటుంది. గుండ్రాళ్లల్లో ఎరుపు, నలుపు, నీలం, గోమేధికం, గోధుమ రంగులుంటాయి. సైజులను, రంగుల ప్రకారం రాయిని వేరు చేసి నిల్వ చేసి విక్రయిస్తున్నారు. మూడు కేజీల నుంచి 100 గ్రాముల వరకు సైజుల ప్రకారం ప్యాకింగ్ చేస్తారు. ఇంటి ఎలివేషన్, ఆవరణ, పార్కుల్లో డిజైన్, పెద్దపెద్ద సెజుల నిర్మాణాలకు వీటిని వాడుతున్నారు. నదీ ప్రవాహానికి రాళ్లు పాలిష్ పట్టినట్లుగా తయారుకావడంతో కట్టడాలకు గుండ్రాళ్ల అమరిక మంచి ఆకర్షణగా నిలుస్తున్నది. ఏండ్ల తరబడి విలువైన ఖనిజ సంపద తరలిపోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రంగురాళ్లు, సాలగ్రామాలు సైతం…
గుండ్రాళ్ల ఏరివేతలో పలు మార్లు అతివిలువైన రంగురాళ్లు, పూజలకు ఉపయోగ పడే సాలగ్రామాలు కూడా లభిస్తున్నాయి. ఉంగరాళ్లు, మెడలో వేసుకునే గొలుసులకు అవసరమయ్యే నీలం, పుష్యరాగం, గోమేధికం, లాంటి రంగురాళ్లు కూడా నదీ తీరంలో లభిస్తున్నాయి. వీటితో పాటుగా ఆలయాల్లో దైవస్వరూపంగా పూజలు నిర్వహించే సాలగ్రామాలు కూడా లభిస్తున్నాయి. ఇవి మార్కెట్లో అత్యంత విలువ, ధర పలుకుతున్నాయి.
కృష్ణాతీరం అడ్డాగా అక్రమ దందాలు..
నదీతీరంలో నిఘా సక్రమంగా లేకపోవడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా చీకటి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఆంధ్రాకు చెందిన పలు ముఠాలు గుండ్రాళ్ల వ్యాపారంతో పాటు మద్యం రవాణా, నల్లమట్టి, రెడ్గ్రావెల్, సున్నపురాయి, పీడీఎస్ బియ్యం, గంజాయి దందాలు కొనసాగిస్తున్నాయి. దీంతో పాటుగా రైతులను మోసం చేసేలా నకిలీ గుళికలు కూడా తయారు చేయడం విదితమే. ఇటీవల పోలీస్ వాహనంలో ఆంధ్రాకు మద్యం తరలించిన ఘటనలో కానిస్టేబుల్తో పాటు ఎస్ఐ కూడా సస్పెన్షన్కు గురికావడం వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతున్నది. కృష్ణాతీరంలో నిఘా పెంచాల్సిన అవసరం ఉన్నదని ప్రజలు కోరుతున్నారు.