దీపం..చీకటి నుంచి వెలుగుకు దారి చూపేది. చైతన్య దీప్తిని రగిలించేది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకొనేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. దీంతో మార్కెట్లలో కొనుగోలుదారులతో సందడి నెలకొంది. వస్ర్తాలు, పూజా సామగ్రి, పూలు, పండ్లు, ప్రమిదలు, బొమ్మల కొలువులు, పటాకులు, స్వీట్లు ఇలా పండుగకు కావాల్సిన వస్తువులను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. మంగళవారం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని ప్రధాన పట్టణాల్లోని దుకాణాలు అమ్మకాలు, కొనుగోళ్లతో కిటకిటలాడాయి.
కొవిడ్ సెకండ్ వేవ్తో గతేడాది దీపావళి సంబురానికి దూరంగా ఉన్నవాళ్లు ఈసారి ఘనంగా చేసుకోవాలనుకుంటున్నారు. పండుగకు ఒక్క రోజే మిగిలి ఉండడంతో మార్కెట్లన్నీ సందడిగా మారాయి. పటాకుల దుకాణాల్లో ధరలపై ఆరా.. స్వీట్ షాపులు, పూల దుకాణాల వద్ద ఆర్డర్లు.. ప్రమిదలు, బట్టలు, బొమ్మల కొలువుకు అవసరమైన బొమ్మల కొనుగోళ్లతో మంగళవారం రద్దీ కనిపించింది. మరోవైపు ఆన్లైన్ షాపింగ్ పెద్దఎత్తున సాగుతున్నది. ఈ కామర్స్ సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటించడంతో పట్టణాల నుంచి పల్లెల వరకు అన్ని వర్గాల ప్రజలు ఆర్డర్లు పెడుతున్నారు.
పెరిగిన ధరలు
కోదాడటౌన్ : కోదాడ పట్టణంలో ఎటుచూసినా పండుగ సందడి కనిపిస్తున్నది. పటాకులు, పూలు, ప్రమిదలు, పూజ సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. గతం కంటే ఈ సంవత్సరం ధరలు అధికంగా ఉన్నప్పటికీ కొనుగోలు దారుల్లో మాత్రం ఆసక్తి తగ్గలేదు. సాధారణంగా ప్రమిదలు సైజును బట్టి రూ. 5 నుంచి రూ. 10 ఉండగా మంగళవారం రూ. 15 నుంచి 25 వరకు అమ్మారు. వీటితోపాటు బొమ్మల కొలువు కోసం బొమ్మలు కూడా కొనుగోలు చేస్తున్నారు. లక్ష్మీ దేవి
పటాలు..
దీపావళి అంటేనే లక్ష్మి పూజ ప్రధానంగా చేస్తారు. ఇందుకోసం లక్ష్మిదేవి చిత్రపటాలను వివిధ మోడల్స్ మార్కెట్లో అందుబాటులో ఉండంతో ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. వీటిని రూ. 20నుంచి 350 వరకు అమ్ముతున్నారు.
వెలుగుల పండుగకు వెరైటీ ప్రమిదలు
ఆలేరురూరల్ : దీపావళి సందర్భంగా మార్కెట్లలో సందడి వాతావరణం నెలకొంది. పండుగకు తమ ఇండ్లను దీపాలతో అలంకరించేందుకు మహిళలు పలు రకాల ప్రమిదలను కొనుగోలు చేస్తున్నారు. మట్టితో తయారు చేసిన వివిధ డిజైన్ల దీపపు కుందీలు, బొమ్మల కొలువు కోసం అవసరమైన బొమ్మలు అందుబాటులో దొరుకుతున్నాయి.
15 శాతం పెరిగిన పటాకుల రేట్లు
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గుజరాత్, శివకాశితోపాటు ఆంధ్రప్రదేశ్లోని చిలుకలూరిపేట, మంగళగిరి నుంచి పటాకులు తీసుకొస్తారు. నల్లగొండ జిల్లాలో చర్లపల్లి, పానగల్ బైపాస్, ఎన్జీ కళాశాల.. సూర్యాపేట జిల్లా కేంద్రం, కోదాడ, హుజూర్నగర్.. యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్, భువనగిరిలో పటాకుల దుకాణాలు వెలిశాయి. ఇక్కడి నుంచి జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు పటాకులు తీసుకెళ్లి విక్రయిస్తారు. గత సంవత్సరంతో చూస్తే బాణసంచా ధరలు 10-15 శాతం పెరిగాయి.
గిరాకీ మొదలైంది..
అన్ని రకాల పటాకులు తెచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచాం. వారం రోజులుగా గిరాకీ అంతగా లేదు. ఇప్పుడే స్వల్పంగా ప్రారంభమైంది. బుధ, గురువారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది.
లాభాల బంతి
ఆత్మకూరు(ఎం), నవంబర్ 2 : దీపావళి పండుగకు వివిధ రకాల పూలు వినియోగిస్తుంటారు. ఎక్కువగా బంతి వాడడంతో వాటికి డిమాండ్ బాగా పెరిగింది. మండలంలోని మోదుగుకుంట గ్రామానికి చెందిన రైతు మామిడి శ్రీనివాస్రెడ్డి ఎకరం భూమిలో బంతిపూల తోటను వేయగా ఇప్పుడు కాతకు వచ్చింది. పండుగ కోసం విక్రయించడానికి మంగళవారం పూలను కోశాడు. వ్యాపారులు తోట దగ్గరికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. కిలో రూ.100 అమ్ముతున్నామని, ఎకరం పెట్టుబడి రూ.30 వేలు ఖర్చు పెట్టగా ఖర్చు పోను రూ.30 వేల ఆదాయం వచ్చినట్లు రైతు శ్రీనివాస్రెడ్డి తెలిపాడు.
పూలకు భలే గిరాకీ
మిర్యాలగూడ టౌన్, నవంబర్ 2 : దీపావళి పండుగ వచ్చిందటే పూలకు బాగా డిమాండ్ ఉంటుంది. లక్ష్మిపూజ, నోములు, ఇంటి అలంకరణ కోసం ఎక్కువగా పూలను వాడుతుంటారు. ఈ ఏడాది వర్షాలు కారణంగా బంతి, గులాబీ పూల పంటల దెబ్బతినడంతో వాటి ధరలు పెరిగాయి. బంతిపూలు మార్కెట్లో కిలో రూ.100, బంతిపూల దండ రూ.120 వరకు ఉన్నది. చామంతి కిలో రూ.300, చామంతి దండ రూ.200, మూర రూ.30 పలుకుతున్నది. గులాబీ పూలు కిలో రూ.400, దండ రూ.400 ఉన్నది. లిల్లీ పూలు కిలో రూ.300, దండ రూ.200.. మల్లెపూలు కిలో రూ.100, మూర రూ.50, జాజి పూలు కిలో రూ.800, మూర రూ.40 పలుకుతున్నది.
జోరుగా ఆన్లైన్ షాపింగ్
పట్నం నుంచి పల్లె దాకా వ్యాపారం భారీ ఆఫర్లతో పెరిగిన కొనుగోళ్లు
రామగిరి, నవంబర్ 2 : దీపావళి పండుగకు వంట, పూజా సామగ్రితోపాటు బట్టలు ఎక్కువగా కొంటారు. ఆయా వస్తువులు తీసుకోవడానికి దుకాణాలకు వెళ్లకుండా ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ అందుబాటులోకి వచ్చింది. ఇంటికే వస్తువులను తెచ్చి ఇస్తుండడంతో సెల్ఫోన్లోనే కావాల్సిన వాటిని కొనేస్తున్నారు.
సమయం ఆదా అవుతుందని..
ఆన్లైన్ వ్యాపారం గతంలో పట్నంలో మాత్రమే సాగేది. ఇప్పుడు పల్లెలకు కూడా పాకింది. పలు కంపెనీలు పండుగ ఆఫర్స్ ప్రకటిస్తుండంతో పెద్ద సంఖ్యలో ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. వంట సామగ్రి నుంచి బట్టలు, సెల్ఫోన్లు, ఇతర వస్తువులు తీసుకుంటున్నారు. సమయం, డబ్బు ఆదా అవుతుండటంతో వీటివైపే జనం ఆసక్తి కనబరుస్తున్నారు.
ఆన్లైన్లో తక్కువ ధర
బయట మార్కెట్ కంటే ఆన్లైన్ మార్కెట్లో కొంచెం తక్కువ ధరలున్నాయి. జియో మార్కెట్ల్లో ప్రత్యేక ఆఫర్స్ ఉండడంతో దీపావళికి ఆన్లైన్లోనే బుకింగ్ చేశాం.. ఇంటికే వచ్చి ఇచ్చి వెళ్లారు. అన్నింటిపై సుమారుగా బయటి మార్కెట్తో చూస్తే రూ. 2నుంచి 3వేలు లాభం జరిగింది. బట్టలు, ఎలక్ట్రానిక్స్ అమెజాన్లో బుక్ చేస్తే త్వరగా వస్తున్నాయి.
వస్త్ర దుకాణాలు కళకళ
భువనగిరి కలెక్టరేట్ : దీపావళికి గౌరీ పూజ, సత్యనారాయణ వ్రతాలు, కేదారేశ్వరి నోములను ప్రజలు నిర్వహించుకుంటారు. దీనికోసం కుటుంబ సభ్యులు కొత్త బట్టలు కొనుక్కొంటారు. దీంతో వస్త్ర దుకాణాలు జనంతో కళకళలాడుతున్నాయి. కరోనా ప్రభావం లేకపోవడంతో విక్రయాలు ఆశాజనకంగా ఉన్నాయని వ్యాపారులు చెప్తున్నారు.
పుంజుకున్న వ్యాపారం
గత సంవత్సరం కరోనా కారణంగా వస్త్ర వ్యాపారాలు సరిగ్గా జరుగలేదు. ఈ ఏడాది దసరాకు, ఇప్పుడు బట్టల అమ్మకాలు పుంజుకున్నాయి. ప్రజల అవసరాల మేరకు కొత్తకొత్త డిజైన్లను అందుబాటులో ఉంచుతున్నాం.