పటాన్చెరు టౌన్, ఏప్రిల్ 14 : సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి చిట్కుల్ సమీపంలోని నక్కవాగు చెత్త డంపింగ్కు కేంద్రంగా మారింది. దీంతో నక్కవాగు క్రమంగా కాలుష్యం బారిన పడుతున్నది. మున్సిపాలిటీగా మారక ముందు నుంచే నక్కవాగులో చెత్త డంపింగ్ కొనసాగుతుండగా, మున్సిపాలిటీగా మారిన తరువాత కూడా చెత్త డంపింగ్లో ఏ మార్పు లేదు. బచ్చుగూడ నుంచి చిట్కుల్ వైపు వెళ్లే ప్రధాన రోడ్డుకు ఆనుకొని నక్కవాగులో చెత్తను డంపింగ్ చేస్తుండడంతో భరించలేని దుర్వాసన వస్తున్నది. చెత్తకు మంటలు అంటుకోవడంతో ప్రమాదకరమైన పొగలు వ్యాపిస్తున్నాయి.
సమీపంలోనే నిర్మాణాలు జరుగుతుండడంతో భవన నిర్మాణ కార్మిక కుటుంబాలు వాగు దగ్గరలో నివాసం ఉంటున్నాయి. డంపింగ్ చేసిన చెత్త నుంచి వస్తున్న దుర్వాసన, మంటలు అంటుకోవడంతో వ్యాపిస్తున్న పొగను పీలుస్తూనే గడుపుతూ అనారోగ్యాలకు గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు ఇక్కడ చెత్తను వేయకుండా నివారణ చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు తెలిపారు. చెత్త డంపింగ్పై పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడే అధికారులు హడావిడి చేస్తున్నారు తప్పా శాశ్వత చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. బచ్చుగూడెం నుంచి చిట్కుల్కు వచ్చి వెళ్లే వాహనదారుల సంఖ్య పెరిగింది. చెత్తను డంపింగ్ చేసిన చోటుకు రాగానే ముక్కు పుటాలు అదిరే వాసన వస్తుండడంతో వాహనాల వేగం పెంచుతున్నారు.
కాలుష్యమయంగా నక్కవాగు
నక్కవాగులో డ్రైనేజీ నీరు, రసాయన వ్యర్థాలు కలుస్తుండడంతో తన సహజ అస్థిత్వాన్ని వాగు పూర్తి గా కోల్పోయింది. ప్రమాదకర వ్యర్థాల నిత్య ప్రవాహంతో భూకాలుష్యం ఏర్పడుతోంది. దీనికి తోడు డంపింగ్ చేసిన చెత్త, దహనమైన వ్యర్థాలు వాగులో కలుస్తున్నాయి. చెత్త డంపింగ్ విషయంలో స్థానికుల నుంచి అభ్యంతరాలు, వినతులు వస్తున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ఇస్నాపూర్ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డుకు ఈ చెత్తను అధికారులు తరలించలేకపోతున్నారు. జీపీ సమయంలో కొనసాగించిన పద్ధతులనే ఇప్పటికీ సిబ్బంది కొనసాగిస్తూ నక్కవాగులో చెత్తను పారవేస్తున్నా అధికారులు నివారించలేకపోతున్నారు. నక్కవాగులో చేత్త వేయకుండా డంపింగ్ యార్డుకు తరలించేలా అధికారులు చర్యలు చేపట్టి వాగును కాలుష్యం బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.