జెరూసలెం : టెల్ అవీవ్ నగరంలో
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును నగ్న విగ్రహాన్ని ప్రతిష్టించారు. నగ్నంగా కూర్చొని ఉన్న నెతన్యాహు విగ్రహాన్ని టెల్ అవీవ్ నగరంలోని హబీమా స్క్వేర్ వద్ద ఏర్పాటు చేశారు.
దీనిని గుర్తించిన అధికారులు విగ్రహం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి విగ్రహాన్ని తొలగించేందుకు నోటీసులను అంటించారు. ఈ నెల 23 న ఇజ్రాయెల్లో సాధారణ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రధాని నగ్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బొగ్గు రంగులో ఉన్న నెతన్యాహు విగ్రహం కూర్చుని ఉన్నట్లు ఉండగా.. ఆయన తల మాత్రం రోడ్డు గుండా పోయేవారిని చూస్తున్నట్లుగా ఉన్నది. నిత్యం రద్దీగా ఉండే హబీమా స్క్వేర్ వద్ద నగ్న విగ్రహం ఏర్పాటుచేయడంతో ఆ రోడ్డు గుండా పోయేవారి దృష్టిని ఆకర్శిస్తున్నది. ఈ విగ్రహం ఐదు మీటర్ల పొడవు, ఆరు టన్నుల బరువు కలిగి ఉన్నట్లు స్థానిక వార్తా పత్రికలు తెలిపాయి. మరో వారం రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ప్రస్తుత ప్రధానిపై నిరసన వ్యక్తం చేయడానికి ఈ రకంగా విగ్రహాన్ని ఏర్పాటుచేసినట్లు పత్రికలు పేర్కొన్నాయి. నెతన్యాహు కాంస్య విగ్రహాన్ని గతంలో ఏర్పాటు చేసినట్లు పలువురు గుర్తుచేసుకుంటున్నారు. నెతన్యాహూ విధానాన్ని నిరసిస్తూ ఓ పెయింటర్.. విశాలమైన టేబుల్పై విలాసవంతమైన భోజనాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా ఉండే పెద్ద చిత్రాన్ని ఎగ్జిబిట్ చేశారు. నెతన్యాహుకు వ్యతిరేకంగా ఇటీవల వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి ఆయనే ప్రధాన కారకుడని ప్రజలు మండిపడుతున్నారు. మార్చి 23 న ఇజ్రాయెల్ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండేండ్లలో ఇవి నాలుగో రౌండ్ పోల్స్ అవుతాయి.
ఇజ్రాయెల్ చరిత్రలో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నెతన్యాహు నిలిచారు. ఈయన 14 ఏండ్లకు పైగా ప్రధాని పదవిలో కొనసాగారు.