ఆరుతడి పంటల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేయమని కేంద్రం
తేల్చి చెప్పడంతో సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచిస్తున్నారు. ఈ మేరకు
వరి సాగు చేయకుండా.. ఇతర పంటల వైపు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో
ఉమ్మడి జిల్లాలో పప్పు, నూనెగింజలు సాగు చేసేలా కర్షకులను వ్యవసాయ అధికారులు
ప్రోత్సహిస్తున్నారు. దీంతో గతేడాదికి భిన్నంగా మినుములు, కందులు, మొక్కజొన్న, జొన్న,
శనగలు, ఆముదం, వేరుశనగ, పొద్దుతిరుగుడు, పెసర, నువ్వుల సాగుపై దృష్టి సారించారు.
ఈ యాసంగిలో 7,21,423 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు
అంచనా వేశారు. ఇప్పటికే 50శాతం మేర పంటలు సాగు చేశారు.
నాగర్కర్నూల్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : యాసంగి పంటల సాగులో రైతన్నలు నిమగ్నమయ్యారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే సీజన్ నుంచి ధాన్యం కొనుగోలు చేయబోమని ప్రకటించింది. దీంతో సీఎం కేసీఆర్ పిలుపు, వ్యవసాయ శాఖ కల్పించిన అవగాహనతో నాగర్కర్నూల్ జిల్లాలో 20 నుంచి 30 శాతం రైతులు పప్పు, నూనె గింజల పంటల సాగుపై మొగ్గు చూపిస్తున్నారు. జిల్లాలో గత యాసంగి సీజన్లో 1,55,569 ఎకరాల సాధారణ సాగు అంచనాకు గానూ.. 3,06,897 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో ఆశించిన స్థాయికి మించి వరి సాగు చేయడం గమనార్హం. గత సీజన్లో 43,189 ఎకరాల్లో వరి సాగు అంచనా వేయగా.. 1,47,829 ఎకరాల్లో సాగైంది. కాగా, ఈసారి 1.10 లక్షల ఎకరాలు మాత్రమే సాగు కావచ్చని వ్యవసాయ శాఖ అంచనా. దీంతో జిల్లాలో దాదాపుగా 37 వేల ఎకరాల్లో వరి సాగు తగ్గనున్నది. గత సీజన్లో జిల్లాలో కొనుగోలు చేసిన 3 లక్షల ఎకరాల ధాన్యంలో.. ప్రస్తుతం జిల్లాలోనే 2 లక్షల ఎకరాల వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ వానకాలం సీజన్లో కొనుగోలు చేయనున్న ధాన్యం తరలించడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ కల్పించిన అవగాహనతో రైతులు పప్పు, నూనె గింజల సాగుపై ఆసక్తి చూపనున్నారు. మార్కెట్లో ఈ పంటలకు అధిక మద్దతు ధర, డిమాండ్ ఉన్నది. అలాగే స్వల్ప కాలంలో దిగుబడి వస్తుంది. ఇందులో ఆముదం, పెసర్లు, నువ్వులు, శనగలు, మొక్కజొన్న, జొన్న వంటి పంటలు పండించేందుకు రైతులు సన్నద్ధం కానున్నారు. జిల్లాలో గత సీజన్లో 3,06,897 ఎకరాల పంట సాగు అంచనా ఉండగా.. ఈ ఏడాది 3,09,500 ఎకరాల్లో సాగు కానున్నది. ఇందులో అత్యధికంగా వేరుశనగ 1,65,933 ఎకరాల్లో సాగు చేయనున్నారు. గతేడాది 1,35,922 ఎకరాలుండగా.. 30 వేల ఎకరాల వేరుశనగ సాగు అంచనా పెరిగింది. వానకాలంలో వేసిన వరి పంట ఇంకా కోత దశలోనే ఉన్నది. దీంతో ఈ సీజన్లో ఎక్కడా వరి పంట సాగు నమోదు కాలేదు. కాగా, కేంద్రంలోని బీజేపీ వైఖరితో వరి సాగుపై రైతాంగం మొగ్గు చూపే పరిస్థితులు కనిపిచడం లేదు. ఇలా జిల్లాలో వరికి బదులుగా ఈ సీజన్లో పప్పు, నూనె గింజల పంటలపై ఆసక్తి చూపుతున్నారు.
ఆరుతడి పంటలపై మొగ్గు..
నాగర్కర్నూల్ జిల్లాలో యాసంగి సీజన్లో రైతులు ఆరుతడి పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్ డిమాండ్ మేరకు పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాం. దీంతో ఈ సీజన్లో 20 నుంచి 30 శాతం వరకు వరి సాగు తగ్గే అవకాశం ఉంది. వేరుశనగ, మినుములు మొక్కజొన్న వంటి పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు.
మూసధోరణి వీడాలి..
రైతులు మూసధోరణి వీడాలి. ఎప్పుడూ ఒకే ర కమైన పంట వేయడం వల్ల ఆదాయం దెబ్బతింటుంది. ప్రత్యామ్నాయ పంటలు వేస్తే రైతులకు మంచి ఆదాయం వ స్తుంది. ఎప్పుడూ వరి సాగు చేయడం వల్ల రా నున్న రోజుల్లో భూసా రం తగ్గుతుంది. అలా కాకుండా పంట మార్పిడి చేస్తే భూసారం దెబ్బతినకుండా మంచి దిగుబడి కూడా వస్తుంది. అవగాహన కల్పించడంతో ఈ సారి జిల్లాలో మినుముల సాగు పెరిగింది.