నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ ప్రాంతం కవులు, కళాకారులకు, ఉద్యమాలకు నిలయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సామాజిక రంగంలో విశేష కృషి చేసిన సామాజిక వేత్త దుశర్ల సత్యనారాయణ, కవి నాళేశ్వరం శంకరంలకు జిల్లా కేంద్రంలోని సి.ఎన్.ఆర్.పాఠశాలలో చింతలపల్లి నిర్మలాదేవి నారాయణరావు 2021, 2022, జీవనసాపల్యపు రస్కారాలను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దుశర్ల సత్యనారాయణ జలసాధన సమితి తరుపున ప్లోరోసిస్ నిర్మూలనకు కృషి చేశారని,నాళేశ్వరం శంకరం సాహిత్య రంగంలో గొప్ప కృషి చేసిన వీరికి ఈ అవార్డులు ఇవ్వడం సముచితమన్నారు. కందనూలు ప్రాంతం సాహిత్యానికి కందెనలాంటిదని తెలంగాణ ఉద్యమంలో కవులు కళాకారుల పాత్ర గణనీయమైనదని అన్నారు.
ఆకాలం నుండి ఈ కాలంవరకు తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి కొరకు ఉద్యమాలు నడిచాయన్నారు.
నాడు పంటలు లేక వలసలు పోతే నుడు తెలంగాణ రాష్ట్రంలో పండుతున్నదని ధాన్యం కొనమని చేతులెత్తేసే పరిస్థితి కేంద్రానికి వచ్చిందంటే నీటిప్రవాహం మన జీవనంలో ఎంత ఉందో తెలుసుకొవొచ్చో అని అన్నారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ గౌరీశంకర్ మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ ప్రశస్తమైందని నాగర్ కర్నూలంటే బుద్దుడు కేసరిసముద్రం సాహిత్యం ఈ అవార్డులు గుర్తుకొస్తాయని అన్నారు. దేశంలో ప్రజలమనసుల్లో మతం పేరుతో విషబీజాలు నాటుతున్నారని దీనిపై కవులు తమకలాలు జులిపించాలని కవులను కోరారు.
ఎమ్మెల్సీ, ప్రజాకవి గోరటి వెంకన్న మాట్లాడుతూ.. లౌకిక ప్రజాస్వామ్య విలువలకు కలిసికట్టుగా పని చేయాలన్నారు. అలాగే మతోన్మాదానికి వ్యతిరేకంగా మానవీయ సమాజం కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నాగర్కర్నూల్, సిఎన్ఆర్ స్కూల్, భాస్కర్ రావుతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా వెంకన్న గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రిజనార్దన్ రెడ్డి, రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యదర్శి కటికనేని మదన్ మోహన్, భాస్కర్ రావు, నాగవరం బాలరాం, చింతలపల్లి రాంచందర్ రావు, రంగినేని సుమతి,చంద్రకళ, విజయమోహన్, కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జక్కా రఘునందన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కల్పన, నిర్వాహకులు హెచ్.రమేష్ బాబు, వనపట్ల సుబ్బయ్య, ముచ్చర్ల దినకర్, బాలీశ్వర్, కల్వకోల్ మద్దిలేటి, కందికొండ మోహన్ తదితరులు ఉన్నారు.