హైదరాబాద్/సిటీబ్యూరో, జనవరి 25 : నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సెల్ (న్యాక్) గుర్తింపు కోసం తొలిసారిగా ప్రయత్నించిన జేఎన్టీయూ జగిత్యాల (నాచుపల్లి) కాలేజీ అరుదైన రికార్డును సాధించింది. జేఎన్టీయూ యూనివర్సిటీని మించిన ర్యాంకును కైవసం చేసుకున్నది. జేఎన్టీయూ జగిత్యాల 3.29 క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్స్ యావరేజ్ (సీజీపీఏ) పాయింట్లతో న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ను సొంతం చేసుకున్నది. ఈ కాలేజీకి ఏ ప్లస్ గుర్తింపు ఇచ్చినట్టు జేఎన్టీయూ హైదరాబాద్కు న్యాక్ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించినట్టు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి మంగళవారం తెలిపారు. జేఎన్టీయూ వర్సిటీ న్యాక్ ఏ గ్రేడ్ను సొంతం చేసుకోగా.. జగిత్యాల కాలేజీ అంతకు మించి ఏ ప్లస్ గ్రేడ్ గుర్తింపు సాధించింది. ఈ గుర్తింపు ఐదేండ్లపాటు ఉంటుందని న్యాక్ అధికారులు తెలిపారు. జేఎన్టీయూ పరిధిలో కూకట్పల్లి కాలేజీ, సుల్తాన్పూర్, మంథని, సిరిసిల్ల, జగిత్యాలల్లో క్యాంపస్లు ఉండగా, ఒక్క జగిత్యాల క్యాంపస్ మాత్రమే న్యాక్ గుర్తింపు దక్కించుకున్నది.
90 శాతం పీహెచ్డీ ఫ్యాకల్టీ
జేఎన్టీయూహెచ్ జగిత్యాల ఇంజినీరింగ్ కాలేజీని 2007లో ప్రారంభించారు. ఈ కాలేజీలో ఈఈఈ, ఈసీఈ, సీఎస్ఈ, ఐటీ, మెకానికల్ బ్రాంచ్లు ఉన్నాయి. మొత్తం 300 సీట్లు ఉన్నాయి. 250 సీట్లతో పెద్ద ఆడిటోరియం ఉన్నది. 24X7 కంప్యూటర్ ల్యా బులు, అంబులెన్స్, బ్యాంక్, ఏటీఎం, స్పోర్ట్స్ మైదానం, వంటి అనేక సదుపాయాలు ఏర్పాటుచేశారు. కాలేజీ 90 శాతం పీహెచ్డీ ఫ్యాకల్టీలో కొనసాగుతున్నది. తమ కాలేజీకి న్యాక్ గుర్తింపు రావడంలో విద్యార్థులు, టీచింగ్ సిబ్బంది భాగస్వామ్యం ఉన్నదని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వీ వెంకటేశ్వర్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.