మాస్కో, డిసెంబర్ 19: రష్యాలో అంతుబట్టని వైరస్ విస్తరించిందని, ప్రజలు పెద్ద సంఖ్యలో అనారోగ్యం బారిన పడుతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా దవాఖానాల వద్ద రోగులను దింపేందుకు అంబులెన్స్లు క్యూ కట్టాయని మీడియా కథనాలు పేర్కొన్నాయి. వీడియో ఫుటేజ్లను రష్యాకు చెందిన టెలిగ్రామ్ చానల్ ‘బాజా’ విడుదల చేయటం సంచలనం రేపింది. ‘మాస్కోలోని రెండు అంటువ్యాధుల దవాఖానాల ముందు అంబులెన్స్లు క్యూ కట్టాయి. రోగుల్ని దవాఖానలో చేర్చేందుకు వేచి చూస్తున్నాయి.
చాలామంది నిమోనియాతో అనారోగ్యం పాలైయ్యారని తెలిసింది’ అని ‘బాజా’ చానల్ పేర్కొన్నది. ఒక దవాఖాన ముందు 30, రెండో దవాఖాన ముందు 10కిపైగా అంబులెన్స్లు క్యూ కట్టినట్టు చూపింది. ‘రష్యా అంతటా అంతుబట్టని వైరస్ విస్తరించటం మొదలైంది’ అని ప్రముఖ మీడియా ‘ఎంకే.ఆర్యూ’ తెలిపింది. అయితే తాజా పరిస్థితి తెలిపేందుకు వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వ వర్గాలు నిరాకరిస్తున్నాయి. దవాఖానల వద్ద అంబులెన్స్ల వరుస.. సర్వసాధారణమేనని ‘క్రెమ్లిన్’ ఆరోగ్య విభాగం పేర్కొన్నది.