మల్కాజిగిరి, డిసెంబర్ 17: ఇరుకైన బ్రిడ్జి వద్ద ట్రాఫిక్తో సతమతమవుతున్న వెస్ట్ వెంకటాపురం వాసులకు త్వరలో ఇబ్బందులు తప్పనున్నాయి. రూ.1.40 కోట్ల నిధులతో బ్రిడ్జి వెడల్పు పనులు ప్రారంభమయ్యాయి. ఈ బ్రిడ్జి పూర్తయితే ఈ ప్రాంతవాసుల ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే..
గతంలో మట్టి రోడ్డుతో పాటు కల్వర్టు నిర్మాణం అల్వాల్ సర్కిల్ వెస్ట్ వెంకటాపురం మెయిన్ రోడ్డులోని నాలాపై 1975లో మట్టితో రోడ్డు వేశారు. అల్వాల్ నుంచి మౌలాలీకి నీటి పైపులైన్ వేయడానికి వాటర్ వర్క్స్ అధికారులు ఈ రోడ్డును ఉపయోగించేవారు.
అప్పట్లో ఇక్కడ అన్ని పొలాలు ఉండేవి. రోడ్డును వేయడానికి అప్పటి వ్యవసాయదారులు స్వయంగా ట్రాక్టర్లతో మట్టిపోశారు. 1976లో అల్వాల్ పంచాయతీ వారితో పాటు వాటర్ వర్క్స్ శాఖ సంయుక్తంగా 12 ఫీట్ల వెడల్పుతో చిన్నపాటి కల్వర్ట్ బ్రిడ్జిని నిర్మించారు. అప్పట్లో ఉన్న జనసాంద్రతకు అది సరిపోయింది. కాలానుగుణంగా వెస్ట్ వెంకటాపురంలో ఉన్న పొలాలు లే ఔట్లుగా మారిపోయాయి. దీంతో చాలామంది ఇక్కడ శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి వేగంగా అభివృద్ధి చెందిన కాలనీలకు 1985లో ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించారు. దీంతో జనసాంద్రత మరింత ఎక్కువైంది.
ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు కాలేజీల బస్సులు, కార్లు, ఆటోలు, బైక్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో రోజూ వెస్ట్ వెంకటాపురం బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ జామ్ కావడంతో ఉద్యోగులు, కాలేజీలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు నరకయాతన పడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారించింది. వెంటనే అధికారులతో సర్వే చేయించి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో అధికారుల నివేదికలు పరిశీలించిన ప్రభుత్వం ఇక్కడ బ్రిడ్జి వెడల్పుతో పాటు వాటర్ పైపులైన్ పనులకు ఇబ్బందులు జరుగకుండా బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.40 కోట్ల నిధులు మంజూరు చేసింది.
నిర్మాణ ప్రణాళికలను అధికారులు సాంకేతిక నిపుణులతో పరిశీలించి నివేదిక అందజేశారు. అప్పట్లో వెస్ట్ వెంకటాపురం మెయిన్ రోడ్డులో రూ.1.40 కోట్లతో బ్రిడ్జి విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బ్రిడ్జి విస్తరణ పనులు జరుగుతున్నాయి. దీంతో అల్వాల్ వెస్ట్ వెంకటాపురం వాసుల చిరకాల కోరిక త్వరలో కార్యరూపం దాల్చనున్నది.