మోగా (పంజాబ్), నవంబర్ 14: రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని సోనూసూద్ తెలిపారు. అయితే ప్రజలకు సేవ చేయాలని తన సోదరి మాళవిక సూద్ భావిస్తున్నారని, వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారని చెప్పారు. కరోనా సమయంలో వలస కూలీలకు, పేదలకు అండగా నిలిచి సోనూసూద్ ప్రశంసలు అందుకొన్న సంగతి తెలిసిందే. అయితే మాళవిక ఏ పార్టీ తరఫున పోటీ చేసేదీ ఆయన తెలుపలేదు. పార్టీలు ముఖ్యం కాదని, విధానాలే శాశ్వతమని పేర్కొన్నారు. ఆయన ఇటీవల పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ను కలిశారు. అంతకుముందు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో కూడా భేటీ అయ్యారు.