తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనులపండువలా సాగుతున్నాయి. వేడుకల్లో మూడో రోజు శనివారం రాత్రి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు బకాసురవధ అలంకారంలో ముత్యపు పందిరి వాహనంపై నుంచి భక్తులను అనుగ్రహించారు. వాహన సేవల్లో పెద్దజీయర్ స్వామి, చినజీయర్ స్వామి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహన్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఈవో డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు ప్రశాంతి రెడ్డి, సనత్ కుమార్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, సీవీఎస్వో గోపినాథ్ జెట్టి దంపతులు, వీజీఓ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో రమేశ్బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీవారు కల్పవృక్ష వాహనంపై, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.