ఖైరతాబాద్, జనవరి 3: ఆవిడ.. మా ఆవిడే.. అంటూ ఒక భార్య కోసం ఇద్దరు భార్తలు పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కిన ఘటనలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకొన్నది. ముగ్గురూ కలిసి హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా ముందుకు వచ్చారు. ఇరు వర్గాల కుటుంబాలు మీడియా ముందే ఒకరినొకరు దూషించుకొన్నారు. ముందుగా మీడియాతో మాట్లాడిన మహిళ దుర్గా సత్యదేవి.. ఇద్దరు భర్తలు అంటూ ఎస్ఆర్నగర్ పోలీసులు తనను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆరోపించింది. తనకు మొదటి భర్తనంటూ ఫిర్యాదు చేసిన వ్యక్తి (శశికాంత్ వర్మ) తన అక్క భర్త అని, అక్క చనిపోవటంతో ఆమె పిల్లలను చేరదీశానని చెప్పింది. రాయుడు సత్య వరప్రసాద్ (రెండో భర్త) మాట్లాడుతూ.. సత్యదేవి, తాను ఇష్టపూర్వకంగా పెండ్లి చేసుకొన్నామని, ఆమె మీద చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నాడు.
ఆమె పేరు మీదున్న భూమిని లాక్కొనేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించాడు. శశికాంత్ వర్మ మాట్లాడుతూ.. సత్యదేవి తన భార్యేనని, ఇద్దరు పిల్లలున్నారని, తన కోసం కాకుండా పిల్లల కోసమైనా తిరిగి రావాలని కోరారు. 23 ఏండ్లు కాపురం చేసి ఈ వయసులో పిల్లలను వదలిపెట్టి మరో వ్యక్తితో వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశాడు. సత్యదేవి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఆమె తమ రెండో కూతురు అని, శశికాంత్తోనే ఆమె పెండ్లి చేశామని, ఇద్దరు పిల్లలు ఉన్నారని వివరించారు. సమావేశం జరుగుతుండగా అమ్మా! అంటూ ఓ బాలిక ఏడుస్తూ సత్యదేవి కాళ్లు పట్టుకొనే ప్రయత్నం చేసింది. ఓ యువకుడు తాను ఆమె కొడుకునంటూ తల్లిదండ్రులతో దిగిన ఫొటోలను మీడియాకు చూపాడు. మీడియా సమావేశం ముగిశాక ఆ మహిళ రాయుడు సత్యవరప్రసాద్తోనే వెళ్లిపోయింది.