నారాయణపేట టౌన్, డిసెంబర్ 1: క్రీడాకారులు ప్రపంచస్థాయిలో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని కలెక్టర్ హరిచందన సూచించారు. మహారాష్ట్రలోని పాల్గర్లో ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు జాతీయ స్థాయి టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించారు. అండర్-19, అండర్-17, అండర్-15, అండర్-13 విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో తెలంగాణ నుంచి 180మంది క్రీడాకారులు పాల్గొనగా, పేట జిల్లా నుంచి 20మంది క్రీడాకారులు పాల్గొని 25 పతకాలు సాధించారు. ఇందులో 4 బంగారు, 16 వెండి, 5 కాంస్య పతకాలు ఉన్నాయి. కలెక్టర్ హరిచందన క్రీడాకారులను కలెక్టరేట్లో బుధవారం అభినందించి మాట్లాడారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో పేట క్రీడాకారులు అసమాన ప్రతిభ చాటారని కొనియాడారు. అదేవిధంగా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ చేతన క్రీడాకారులను అభినందించారు. క్రీడలను ప్రతిఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో టగ్ ఆఫ్ వార్ అసోషియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు రఘుప్రసన్న భట్, అధ్యక్షుడు గోపాలం, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, కార్యదర్శి దామోదర్, సీఐ ఇఫ్తెకార్ అహ్మద్, ఆర్ఐ కృష్ణయ్య, క్రీడాకారులు పాల్గొన్నారు.