సుల్తానాబాద్, అక్టోబర్ 17: సిగరెట్ ఉద్దెర ఇవ్వనందుకు గంజాయి మత్తులో ఉన్న యువకుడు చిరు వ్యాపారి గొంతులో గొడుగుతో పొడిచాడు. ఈ ఘటన శనివారం రాత్రి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామంలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పడాల ప్రసాద్ పూసాల గ్రామంలో పాన్ టేలా నిర్వహిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన తెలుకుంట్ల పవన్ శనివారం రాత్రి ప్రసాద్ వద్దకు వచ్చి సిగరెట్ ఉద్దెర కావాలని అడిగాడు. పాత బాకీ ఉన్నందున ఇవ్వలేనని చెప్పారు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న పవన్.. గొడుగుతో చిరు వ్యాపారి ప్రసాద్ గొంతులో పొడిచాడు. గమనించిన ప్రసాద్ తల్లి నర్సమ్మ అరవడంతో ఆమెను కూడా గాయపరిచాడు. అయితే ప్రసాద్కు ప్రాణాపాయం తప్పింది. బాధితుడి సోదరుడు కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పవన్ను అరెస్టు చేసినట్టు ఎస్సై ఉపేందర్రావు తెలిపారు.