కేటీదొడ్డి, నవంబర్ 30: భార్య కాపురానికి రావడం లేదనే కోపం తో అభంశుభం తెలియని ఏడాది కొడుకును పొట్టనపెట్టుకున్నాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలోని నందిన్నె గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై కురుమయ్య కథనం ప్రకారం.. నందిన్నెకు చెందిన కుర్వ కర్రెప్పకు కుచినేర్ల గ్రామానికి చెందిన నర్సమ్మతో రెండేండ్ల కిందట వివాహమైంది. వీరికి భరత్ అనే ఏడాది వయస్సు గల బాబు ఉన్నాడు. భార్యాభర్తలు తరచూ గొడవలు పడేవారు. ఇటీవల ఆమె కొడుకును తీసుకొని పుట్టింటికి వెళ్లింది. సోమవారం అత్తగారింటికి వెళ్లిన కర్రెప్ప తనతో రావాలని భార్యను అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కొడుకును బలవంతంగా తీసుకొని నందిన్నెకు వెళ్లాడు. ఆగ్రహంతో బాబుకు పురుగుల మందు తాగించాడు. మధ్యాహ్నం తర్వాత కొడుకును భార్య వద్ద వదిలిపెట్టి వచ్చాడు. చిన్నారి నోటి నుంచి పురుగుల మందు వాసన రావడంతో వెంటనే కర్ణాటకలోని రాయిచూర్ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తన కొడుకుకు తానే పురుగుల మందు తాగించినట్టు కర్రెప్ప అంగీకరించినట్టు ఎస్సై తెలిపారు.