టేక్మాల్, నవంబర్ 30: తన సొంత కూతురు కాదనే కక్షతో మూడేండ్ల చిన్నారిని హతమార్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం పల్వంచ గ్రామంలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. పల్వంచకు చెందిన రమణయ్యకు అదే గ్రామానికి చెందిన సావిత్రితో 2014లో వివాహం జరిగింది. సంతానం కలుగకపోవడంతో ఇరువురి మధ్య గొడవలు తలెత్తగా పెద్దల సమక్షంలో విడిపోయారు. 2016లో అందోల్ మండలం రోళ్లపాడ్కు చెందిన మరో వ్యక్తి ని సావిత్రి పెండ్లి చేసుకోగా పాప పుట్టింది. కొన్నాళ్ల తర్వాత సావిత్రి, రమణయ్య తరచూ ఫోన్లో మాట్లాడసాగారు. ఈ క్రమంలో రెండో భర్తను వదిలేసి, 2020లో రమణయ్యను మళ్లీ పెండ్లి చేసుకొని కూతురు వర్షిణి(3)తో కలిసి జీవిస్తున్న ది. సావిత్రి గర్భం దాల్చడంతో మంగళవారం టేక్మాల్ పీహెచ్సీకి వెళ్లారు. భార్యను వాహనంలో ఇంటికి పంపాడు. వర్షిణిని తీసుకొని టేక్మాల్ నుంచి స్వగ్రామానికి నడుచుకుంటూ బయలుదేరాడు. తన సొంత కూతురు కాదనే కసితో మార్గమధ్యంలో చిన్నారి గొంతు పిసికి చంపేశాడు. మృతదేహాన్ని తీసుకొని ఇంటికి వెళ్లాడు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు నిలదీయడంతో హత్య చేసినట్టు చెప్పాడు.