ముంబై: డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో రోడెక్కనున్నాయి. వీటిని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబై వాసులకు త్వరలో సింగిల్, డబుల్ డెక్కర్ విద్యుత్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. బృహన్ ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) ఈ నెలలో ప్రీమియం ఇ-బస్ సర్వీసులను ప్రారంభించనున్నది. అలాగే కొత్త ఏడాదిలో డబుల్ డెక్కర్ ఇ-బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. దీనికి సంబంధించిన అనుమతులు తుది దశలో ఉన్నాయని బెస్ట్ జనరల్ మేనేజర్ లోకేష్ చంద్ర తెలిపారు. 2023 జనవరి 14న తొలుత పది ఐకానిక్ డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఆ తర్వాత తొలి దశలో భాగంగా ఈ బస్సుల సంఖ్యను 50కి పెంచుతామని వెల్లడించారు.
కాగా, వచ్చే ఏడాది జూన్ నుంచి 500 కార్లతో ఎలక్ట్రిక్ ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు బెస్ట్ ప్రయత్నిస్తున్నది. దీని కోసం ఇప్పటికే టెండర్లు కూడా పిలిచింది. ప్రజలు ‘చలో యాప్’ ద్వారా ఇ-క్యాబ్ సేవలు పొందవచ్చని బెస్ట్ అధికారి తెలిపారు.
మరోవైపు మంబైతోపాటు పరిసర ప్రాంతాలకు బస్సు సర్వీసులను బెస్ట్ సంస్థ నిర్వహిస్తున్నది. మొత్తం 3,500 బస్సుల్లో 400కుపైగా ఇ- బస్సులు ఉన్నాయి. అయితే 45 నాన్ ఏసీ డబుల్ డెక్కర్ డీజిల్ బస్సులను 2023-24 నాటికి సర్వీసు నుంచి తొలగిస్తామని ఆ సంస్థకు చెందిన అధికారి తెలిపారు.