ఆలూర్: ముంబై రంజీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డును నెలకొల్పింది. ఉత్తరాఖండ్తో జరిగిన రంజీ మ్యాచ్లో 725 రన్స్ తేడాతో నెగ్గిన ముంబై.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఏపీలోని ఆలూరులో జరిగిన మ్యాచ్లో ముంబై ఈ ఘనతను అందుకున్నది.
కేఎస్సీఏ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన రంజీ ట్రోఫీ రెండవ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో.. ముంబై బ్యాటర్లు దుమ్మురేపారు. సువేద్ పార్కర్, సర్ఫరాజ్ ఖాన్లు 252, 153 రన్స్ చేశారు. దీంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 648 రన్స్ చేసింది. ఆ తర్వాత ఉత్తరాఖండ్ 114 పరుగులకే ఆలౌటైంది. ఇక ముంబై రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 103, పృథ్వీ షా 72 రన్స్ చేశారు. 261 రన్స్ చేసి ముంబై డిక్లేర్ చేసింది. భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఉత్తరాఖండ్ రెండవ ఇన్నింగ్స్లో 69 రన్స్కు ఆలౌట్ అయ్యింది.
దీంతో ముంబై 725 రన్స్ తేడాతో విక్టరీ సొంతం చేసుకున్నది. అయితే ఈ భారీ తేడాతో విజయాన్ని నమోదు చేయడం ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనే మొదటిసారి. గతంలో 1930లో క్వీన్స్లాండ్పై 685 రన్స్ తేడాతో న్యూ సౌత్ వేల్స్ విజయం సాధించింది. ఇప్పుడు ఆ రికార్డును ముంబై బద్దలు కొట్టింది.