మల్హర్, మార్చి 31: గ్రామీణ ప్రజలకు ఇబ్బంది కలిగినప్పటికీ శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు కాటారం సీఐ హథీరాం అన్నారు. మండలంలోని తాడిచర్ల గ్రామపంచాయతీ పదిధిలోని కాపురం గ్రామంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం 30 మంది సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేసి వివరాలు సేకరించారు. అనంతరం గ్రామస్తులను సమీకరించి సీఐ మాట్లాడారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా డయల్ 100ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇటీవల సైబర్ నేరాలు అధికమయ్యాయని, గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు నంబర్లు, ఓటీపీ, ఏటీఎం కార్డు నంబర్లు అడిగితే చెప్పవద్దని, ఇలాంటి వారి సమాచారం పోలీసులకు ఇవ్వాలన్నారు. గ్రామంలోకి అపరిచిత వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్సై సత్యనారాయణ, ప్రొబేషనరీ ఎస్సైలు మహేందర్, నవీన్, కిరణ్మయి సిబ్బంది పాల్గొన్నారు.