ముషీరాబాద్, నవంబర్ 27: కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీల వర్గీకరణ పూర్తిచేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసంచేసిందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర, జాతీయ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, మేడి పాపయ్య మండిపడ్డారు. విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ.. జనాభా ప్రకారం ఎవరి వాటా వారికి ఇవ్వాలని దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పినా మోదీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. కేంద్రం నుంచి మాదిగలు, మాదిగ ఉపకులాలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందడం లేదని ఆరోపించారు. ప్రస్తుత సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టేలా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు వేదికగా కేంద్రంపై ఒత్తిడి తెవాలని కోరారు. ఎస్సీల వర్గీకరణపై కేంద్రం ద్వంద్వనీతిని ఎండగట్టాలన్నారు. భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటించేందుకు సోమవారం ఎమ్మార్పీఎస్ రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో మాజీ మంత్రులు కడియం శ్రీహరి, రాజయ్యతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు చినబాబు, మీసాల మల్లేశ్, వెంకన్న, నాగరాజు, చందు, శ్రీకాంత్, సురేశ్, రవి తదితరులు పాల్గొన్నారు.