అమరావతి : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజనల్ కాదని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప చెప్పారు. ఒరిజనల్ వీడియో దొరికేంతవరకు నిజనిజాలు తెలియవని స్పష్టం చేశారు. పోస్టు చేసిన వ్యక్తి పలుమార్లు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో స్పష్టమైన ఆధారాలు లభించడం లేదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చింది మార్ఫింగేనని వెల్లడించారు.
మార్ఫింగ్ వీడియోను మొదట ఈనెల 4న ఐ టీడీపీ అఫిషియల్ అనే వాట్సాప్ గ్రూప్లో +447443703968 అనే నంబర్తో యూకే నుంచి పోస్టు చేశారని చెప్పారు. ఒక వ్యక్తి రికార్డ్ చేసిన వీడియోను ఇంకొకరికి పంపించి ఆ వ్యక్తి తన మొబైల్లో చూస్తున్నప్పుడు మరో వ్యక్తి ఆయన మొబైల్ ఫోన్లోని వీడియోను చిత్రీకరించి ఆ వీడియోను వైరల్ చేశారని పేర్కొన్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో పలు సార్లు ఫార్వర్డ్ , రీపోస్టు చేయడం జరిగిందని , ఇలా అనేకసార్లు చేయడం వల్ల ఒరిజినల్ అని నిర్దారించలేకపోతున్నామని ఎస్పీ తెలిపారు. ఈ వీడియో ఒరిజినల్ కాదు మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. బాధితులు ఎవరూ కూడా ఫిర్యా దు చేయలేదని, ఒకవేళ బాధితులు వచ్చి ఫిర్యాదు వస్తే ఎంపీ ఫోన్పై కూడా దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.
ఫేక్ వీడియో అని ఆ రోజే చెప్పా : ఎంపీ గోరంట్ల
తనపై సోషల్ మీడియాలో వచ్చిన వీడియో కాల్ తప్పుడు వీడియో కాల్ అని ఆరోజే స్పష్టం చేశానని ఎంపీ గోరంట్ల మాధవ్ వెల్లడించారు. ఎస్పీ ఫకీరప్ప ఇవాళ ఫోరెన్సిక్ నివేదిక ను విడుదల చేసిన అనంతపురం ఎంపీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫేక్ వీడియోను క్రియేట్ చేసిన వారిపై పరువునష్టం దావా వేస్తానని పేర్కొన్నారు. కొంతమంది దుర్మార్గులు కలిసి చేసిన పని అని వివరించారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టడానికి ఈ కుట్ర చేశారని మండిపడ్డారు. బీసీలు ఎదుగుతుంటే చూసి టీడీపీ ఓర్వలేక పోతుందని అన్నారు.