ట్రాన్స్జెండర్ మహిళగా మారిన ఒక యువకుడిని అతని తల్లి, బంధువులు హత్య చేశారు. ఈ ఘటన తమళనాడులోని సేలం నగరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని సేలం నగరానికి చెందిన ఉమాదేవి(45) జులై నెలలో తన కుమారుడు నవీన్ కుమార్(20) కనబడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని రోజుల తరువాత పోలీసులు నవీన్ కుమార్ని పట్టుకొని కోర్టు ముందు హాజరుపరిచారు.
కోర్టుకు నవీన్ కుమార్ తన సమస్యను చెప్పాడు. తాను ఒక మహిళగా మారిపోయానని.. దీంతో ఇంట్లో తల్లి, బంధువుల గొడవ చేస్తుండడంతో పారిపోయి విడిగా ఉంటున్నానని వివారించాడు. నవీన్ కుమార్ సమస్యను అర్థం చేసుకున్న కోర్టు అతను ఒక మహిళగా జీవించేందుకు అధికారం ఉందంటూ తీర్పునిచ్చింది.
కానీ చాలా కాలం తరువాత డిసెండర్ 13న తల్లిని చూడడానికి ఇంటికి వచ్చిన నవీన్ కుమార్ని అతని తల్లి, బంధువులు చితకబాదారు. కుటుంబ పరువు నాశనం చేస్తున్నాడని నవీన్ బంధువులు అతడికి బలవంతంగా హార్మోన్ ఇంజెక్షన్ వేయాలని కూడా ప్రయత్నించారు. ఈ క్రమంలో నవీన్ అందుకు ప్రతిఘటించేసరికి తల్లి ఉమాదేవి అతడిని బలంగా కొట్టింది. దీంతో నవీన్ కుప్పకూలిపోయాడు. నవీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 14న మృతిచెందాడు. పోలీసులు నవీన్ మరణించక ముందు అతడి వాంగ్మూలం తీసుకొని ఉమాదేవి, ఆమె బంధువులపై హత్య కేసు నమోదు చేశారు.