మాస్కో: రష్యా సైనిక స్థావరంపై గత ఆదివారం అర్ధరాత్రి ఉక్రెయిన్ సేనలు రాకెట్ లాంఛర్లతో దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో 400 మంది రష్యా సైనికులు మరణించారని ఉక్రెయిన్ ఇటీవల ప్రకటించింది. అయితే, ఉక్రెయిన్ ప్రకటనను తాజాగా రష్యా తోసిపుచ్చింది. ఉక్రెయిన్ రాకెట్ దాడిలో 89 మంది రష్యా సైనికులు మరణించారని వెల్లడించింది.
మృతుల్లో తమ రెజిమెంట్ డిప్యూటీ కమాండర్, లెఫ్టినెంట్ కల్నల్ బచూరిన్ ఉన్నట్లు రష్యా విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. గత ఆదివారం అర్ధరాత్రి ఉక్రెయిన్లోని డొనెస్క్ రీజియన్లోగల మకీవ్కా ఏరియాలోని రష్యా సైనికుల స్థావరంపై ఉక్రెయిన్ సేనలు రాకెట్ దాడులకు పాల్పడ్డాయి. అమెరికాలో తయారైన హిమారస్ మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ తో ఆరు రాకెట్లను ప్రయోగించాయి.