బ్యాంకాక్: మయన్మార్లో సైనిక అరాచకత్వం రోజురోజూకు పెరిగిపోతున్నది. 30 మందికిపైగా గ్రామస్థులను చుట్టుముట్టి ఊచకోత కోశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. శుక్రవారం కోయ్గాన్ గ్రామంలో సైనికులకు, సైనిక పాలనను వ్యతిరేకిస్తున్నవాళ్లకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పక్కనే ఉన్న మోసో గ్రామస్థులు భయాందోళనతో ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. వీరిని అరెస్టు చేసిన సైనికులు అందరినీ ఒక్కచోట ఉంచి తుపాకీతో కాల్చిచంపారు. దీంతో 30 మందికిపైగా మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారు. అనంతరం మృతదేహాలన్నింటినీ కట్టేసి నిప్పుపెట్టారు. ఈ ఘటనను పలు దేశాలు ఖండించాయి.