రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారం.. టెస్కాబ్ చేయూత.. పాలక వర్గం, ఉద్యోగుల సమన్వయంతో నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) ఆర్థిక ప్రగతిలో దూసుకెళ్తున్నది. అంతేస్థాయిలో రైతాంగానికి రుణాలు, ఇతర సేవలు అందించడంలో ముందున్నది. రూ.వెయ్యి కోట్ల టర్నోవర్ ఉన్న డీసీసీబీ రెండేండ్లలోనే రూ.1680 కోట్లకు చేరుకొని రైతుల విశ్వాసం పొందుతున్నది. రెండేండ్ల క్రితం 6.55శాతం ఉన్న ఎన్పీఏ (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్)ను గత ఆర్థిక సంవత్సరంలో 4.01 శాతానికి తీసుకు రాగా ఈ ఏడాదికి మూడు శాతానికి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. వ్యవసాయాధారిత, విద్యా రుణాలను గతేడాది కంటే పెంచిన డీసీసీబీ.. బ్యాంకింగ్ సేవలు ఆన్లైన్ చేయడం, రైతులకు రూపే కార్డులు ఇవ్వడం, మొబైల్ ఏటీఎంలు ఏర్పాటు చేసి వాణిజ్య బ్యాంకులకు దీటుగా ముందుకు వెళ్తున్నది.
నల్లగొండ, మార్చి 3 : జిల్లాకేంద్ర సహకార బ్యాంకు పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30 బ్రాంచీలతో పాటు 107 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. సొసైటీలు, బ్యాంకులు రెండేండ్ల కాలంలో ప్రగతి సాధించాయి. పాలక వర్గాలు, అధికార యంత్రాంగం సమన్వయంలో రాష్ట్రప్రభుత్వ సహకారంతో నాబార్డు ద్వారా రుణాలు తీసుకొని టెస్కాబ్ చేయూతతో జిల్లా రైతాంగానికి విరివిగా రుణాలు ఇవ్వడంతో పాటు బ్యాంకుల్లో రైతుల షేర్లను పెంచుతున్నారు. దాంతో రుణ వితరణ వేగంగా విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో గతేడాది రూ.11కోట్ల లాభాలు సాధించిన డీసీసీబీ ఈ ఏడాది రూ.15కోట్ల లాభాలు సాధించే దిశగా అడుగులు వేస్తున్నది. రెండేండ్ల కింద రూ. వెయ్యి కోట్లు ఉన్న టర్నోవర్ ప్రస్తుతం రూ.1,680కోట్లకు చేరింది. రూ.400కోట్లు ఉన్న రైతుల డిపాజిట్లు 31శాతం పెరిగి రూ.526కోట్లకు చేరాయి. డిపాజిట్లకు తోడు నాబార్డు నుంచి రుణాలు తీసుకొని ఇప్పటి వరకు ఈ ఏడాది స్వల్ప కాలిక రుణాలు రూ.514కోట్లు, దీర్ఘకాలిక రుణాలు రూ.150 కోట్లు, విద్యారుణాలు రూ.19కోట్లు, బంగారు రుణాలు మరో రూ.120కోట్లు అందజేయడం ద్వారా తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకొని లాభాలు ఆర్జిస్తున్నది డీసీసీబీ యంత్రాంగం.
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు గతంలో వివాదాల్లో చిక్కుకొని రుణాల రికవరీ సరిగా చేయక పోవడంతో ఎన్పీఏ 6.55శాతం పెరిగి దివాలా తీసే పరిస్థితికి చేరింది. అప్పటి ప్రభుత్వం కూడా బ్యాంక్కు చేయూతనివ్వలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పాలక వర్గానికి వెన్నుదన్నుగా ఉంటూ సూచనలు చేస్తూ బ్యాంకు వ్యాపారాభివృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తున్నది. సర్కారు సూచనలతో రుణాలు ఇవ్వడంతో పాటు వాటి రికవరీపై దృష్టిపెట్టిన నూతన పాలక వర్గం రెండేండ్ల కాలంలోనే 6.55శాతం ఉన్న ఎన్పీఏను మూడు శాతానికి చేరువకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. దాంతో పాటు ప్రభుత్వం టెస్కాబ్ ద్వారా నాబార్డుకు హామీ ఇచ్చి జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు మరిన్ని నిధులిచ్చేలా సహకారం చేసింది. దాంతో బ్యాంక్ అధికారులు పాలకవర్గం సమన్వయంతో రైతులకు రుణ వితరణ పెంచారు. పంట రుణాలు రూ. లక్ష నుంచి రూ.3లక్షలకు పెంచటంతో పాటు పలు యూనిట్ల ద్వారా దీర్ఘ, స్వల్ప కాలిక రుణాలు పెద్ద ఎత్తున అందించడంతో పాటు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి బకాయిలు చేయగలిగారు.
రైతుల శ్రేయస్సే లక్ష్యంగా ఏర్పాటైన సహకార బ్యాంక్ వాణిజ్య బ్యాంకులను మించి రైతులకు పలు రకాల యూనిట్ల కోసం రుణాలు అందచేసింది. గ్రామీణ ప్రాంతాల్లో భూములను తనఖా పెట్టుకొని ఎకరాకు రూ.5లక్షల చొప్పున విద్యారుణాలు అందించారు. 600 మంది విద్యార్థుల విదేశీ విద్యకోసం సుమారు రూ.19కోట్లు అందచేశారు. 250 మంది రైతులకు పౌల్ట్రీ రుణం కింద రూ.25లక్షల చొప్పున రుణాలు, గొర్లు, గేదెల యూనిట్లతో పాటు ట్రాక్టర్లు, ఇతర రంగాల్లో కూడా రునాలు అందించారు. పంట రుణాలు గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ సారి గరిష్టంగా రూ.516కోట్లు అందించిన ఘనత సహకార బ్యాంకుకే దక్కింది. రుణాలు ఇవ్వడంతో పాటు రికవరీలోనూ అప్రమత్తంగా ఉండి వ్యాపారం చేస్తున్న నేపథ్యంలో గతేడాది రూ.11కోట్ల లాభం ఆర్జించిన సహకార బ్యాంక్, ఈ సారి రూ.15కోట్లు సాధించే దిశగా అడుగులు వేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం సహకారం, టెస్కాబ్ చేయూతతో రెండేండ్లలోనే జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఎంతో ప్రగతి సాధించాము. రూ. వెయ్యి కోట్లు ఉన్న టర్నోవర్ నేడు రూ.1680కోట్లకు పెరిగింది. రైతుల నుంచి షేర్లు సైతం పెరగటంతో డిపాజిట్లు రూ. 126కోట్లకు చేరాయి. ఎన్పీఏ 6.55శాతం నుంచి మూడు శాతం వరకు చేరుకుంటున్నాం. విద్యారుణాలతో పాటు పంట, దీర్ఘ కాలిక రుణాలు అధికంగా ఇవ్వడంతో పాటు అదే స్థాయిలో రికవరీ చేయడం వల్లే ప్రగతి సాధ్యమైంది. పాలకవర్గ సభ్యుల సహకారం, అధికారులు కృషి వల్లే ఇంత మంచి ఫలితాలు సాధించాం.
-గొంగిడి మహేందర్ రెడ్డి, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్, నల్లగొండ