న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: షేర్ల విలువ ఇలాగే పడిపోతే నిధుల సమీకరణ కష్టతరమవుతుందని అదానీ గ్రూప్ను గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ దిగ్గజ ఏజెన్సీ మూడీస్ హెచ్చరించింది. గత వారం హిండెన్బర్గ్ నివేదికతో దేశీయ స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ షేర్లు కుప్పకూలుతున్న విషయం తెలిసిందే. ఈ వరుస నష్టాల నేపథ్యంలోనే శుక్రవారం మూడీస్ పైవిధంగా స్పందించింది. కేవలం 6 రోజుల్లో అదానీ గ్రూప్లోని మార్కెట్ నమోదిత 10 సంస్థల విలువ రూ.8.76 లక్షల కోట్ల (100 బిలియన్ డాలర్లపైనే)కుపైగా హరించుకుపోయింది. స్టాక్ అవకతవకలకు అదానీ గ్రూప్ పాల్పడిందంటూ గత నెల 24న హిండెన్బర్గ్ తమ రిపోర్టును విడుదల చేసిన సంగతి విదితమే. మితిమీరిన రుణ భారం ఉందని, మోసాలతో వచ్చిన సంపదను పన్ను ఎగవేతలకు స్వర్గధామాలైనటువంటి దేశాలకు తరలించిందన్నది. అయితే తాము ఎటువంటి తప్పూ చేయలేదని, హిండెన్బర్గ్పై దావా వేస్తామని అదానీ గ్రూప్ చెప్తున్నది. ‘హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువ పెద్ద ఎత్తున పడిపోవడం పాలనాపరమైన లోపాలను ఎత్తిచూపుతున్నది. ఈ సంస్థల మదింపే ఇప్పుడు మా తక్షణ కర్తవ్యంగా కనిపిస్తున్నది. ఇక ఈ సంస్థల ఆర్థిక పరిస్థితులపై దృష్టి పెడుతాం’ అని ఓ ప్రకటనలో మూడీస్ తెలిపింది.
ఇబ్బందులు ఎక్కువే..
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ల రేటింగ్స్.. దీర్ఘకాలిక విక్రయ ఒప్పందాలతో కూడిన ఆయా సంస్థల నియంత్రిత మౌలిక వ్యాపారాలపై ఆధారపడి ఉంటుందన్నది. ఈ సంస్థల మార్కెట్ స్థితిగతులు, వాటి బలమైన నిర్వహణ నగదు నిల్వలు కూడా రేటింగ్స్పై ప్రభావం చూపుతాయని ఈ సందర్భంగా మూడీస్ స్పష్టం చేసింది. అయినప్పటికీ స్టాక్ మార్కెట్లలో భారీగా క్షీణిస్తున్న అదానీ షేర్ల విలువ ఆయా కంపెనీల మూలధన నిధుల సమీకరణకు కొత్త చిక్కుల్ని తెచ్చిపెట్టే వీలు లేకపోలేదని మూడీస్ వ్యాఖ్యానించింది. అంతేగాక వచ్చే 1-2 ఏండ్లకుపైగా కాలంలో గడువు తీరిన బాండ్ల చెల్లింపులకూ ఇబ్బందుల్ని సృష్టించవచ్చని అభిప్రాయపడింది. ఇదిలావుంటే మరో రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ మాత్రం అదానీ సంస్థల క్రెడిట్ రేటింగ్కు ఇప్పటికైతే వచ్చిన ముప్పేమీ లేదని వ్యాఖ్యానించింది.
అదానీ పోర్ట్స్, అదానీ ఎలక్ట్రిసిటీలకు షాక్
అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు వరుసగా గౌతమ్ అదానీకి చెందిన సంస్థలకు షాకిస్తున్నాయి. ఇప్పటికే పలు రేటింగ్ ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేయగా..తాజాగా గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ అయితే అదానీ పోర్ట్స్, అదానీ ఎలక్ట్రిసిటీలకు ప్రతికూల రేటింగ్ ఇచ్చింది. అదానీ గ్రూపులో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలు గ్రూపునకు సంబంధించిన షేర్లు, బాండ్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా గా ఎస్అండ్పీ కూడా ఆందోళణ వ్యక్తం చేయడంతో సూచీలు మరింత పడిపోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది.