ఒకనాడు దేశానికే ప్రధానిని అందించిన ఓరుగల్లు పోరు ఖిల్లాకు ప్రధానమంత్రి రావడం కొత్తకాదు. పండిట్ జహర్లాల్నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నర్సింహారావు ప్రధానులుగా ఉన్నకాలంలో వరంగల్లో పర్యటించారు. ఇప్పుడు మోదీ నాలుగో ప్రధానిగా వరంగల్ వస్తున్నారు. కాబట్టి వరంగల్కు ప్రధాని రావడం కొత్త కాదు. వింత అంతకన్నా కాదు.
ఇప్పటిదాకా వరంగల్లో పర్యటించిన ముగ్గురు ప్రధానులకు, తాజాగా ప్రధాని మోదీ పర్యటనకు మధ్య చారిత్రక అంతరం ఉన్న ది. హైదరాబాద్ స్టేట్ను భాషా ప్రయుక్త రాష్ర్టాల పేరుతో తెలంగాణను ఆంధ్రాలో కలిపిన నెహ్రూ, 1969 తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చిన ఇందిరాగాంధీ సరసన మోదీ నిలుస్తారని గడిచిన తొమ్మిదేండ్ల పాలన నిరూపించింది. ‘తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు’ అని హైదరాబాద్ నడిగడ్డపై ఒకసారి, ‘తెలంగాణ ఏర్పాటు అప్రజాస్వామికంగా జరిగింది. పార్లమెంట్ తలుపులు మూసి మరీ రాష్ర్టాన్ని ఏర్పాటుచేస్తారా?’ అని పార్లమెంట్ సాక్షిగా తెలంగాణపై ప్రధాని హోదాలో మోదీ వ్యాఖ్యానించారు. పోరాటాల పోరు ఖిల్లా.. ఉద్యమాల రగల్జెండా వరంగల్ మోదీ చేసిన ప్రకటనను మరిచిపోతుందా? ప్రధానిగా తొమ్మిదేండ్లు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించిన మోదీ ఉన్నపళంగా వరంగల్పై ప్రేమను ఒలకబోసి వరాల జల్లు కురిపిస్తారంటే వరంగల్ విశ్వసించగలదా? రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీల్లోని ముఖ్యమైన మూడు అంశాలు ఉమ్మడి వరంగల్తో ముడిపడి ఉన్నాయి. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, కాజీపేట కోచ్ఫ్యాక్టరీ స్థాపన, బయ్యారం ఉక్కు పరిశ్రమను నెలకొల్పటం ఈ మూడు వాగ్దానాల్లో మోదీ సర్కార్ ఏ ఒక్కదాన్నయినా అమలుచేశారా?తొమ్మిదేండ్లుగా తెలంగాణను విస్మరించి, ఇప్పుడిప్పుడే వికసిస్తున్న తెలంగాణపై విధ్వంసపు వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నపళంగా మోదీ వరంగల్ పర్యటన చేపట్టడం వెనుక ఆంతర్యాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోకుండా ఉంటుందా?
‘కాజీపేటలో మోదీ వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్కు శంకుస్థాపన చేయనున్నారు. మోదీ తెలంగాణకు ఇస్తున్న వరం’ ఇది కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు, రాష్ట్ర బీజేపీ నాయకులు చేప్తున్నారు. నిజంగా వరమే అయితే స్వరాష్ట్రం గుజరాత్లోని దాహోద్లో రూ. 20 వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన మోదీ కాజీపేటలో రూ.521 కోట్లతో వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నారు. ఇది తెలంగాణకు వరమా? శాపమా? నిలువెల్లా ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని నింపుకొన్న నిప్పుకణం వరంగల్ ప్రజానీకం దీన్ని ఎలా స్వీకరిస్తుంది? నిన్నమొన్నటిదాకా ‘కాజీపేటలో వ్యాగన్ వర్క్షాప్ పెడతామంటే రాష్ట్ర ప్రభుత్వం భూమే ఇవ్వలేదు’ అని బుకాయించినవారు ఇప్పుడు భూమిపూజ ఎక్కడ చేస్తున్నట్టు? కాజీపేట కోచ్ఫ్యాక్టరీ ఉద్యమం నేటిది కాదు. 40 ఏండ్లుగా పోరాటాలు సాగుతూనే ఉన్నాయి.
పీవీ కేంద్రమంత్రిగా ఉన్నకాలంలో కోచ్ఫ్యాక్టరీ కోసం ఉద్యమిస్తున్న నేతలను అఖిలపక్షంగా ఢిల్లీకి తీసుకువెళ్లారు. ప్రధాని ఇందిరాగాంధీతో కోచ్ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తామని 1982లో ప్రకటన చేయించారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ మరణించడం, రాజీవ్గాంధీ ప్రధాని కావడం, ఖలిస్తాన్ ఉద్యమం ఉవ్వెత్తున లేవడం, ఉద్యమాన్ని సంప్రదింపులతో నీరుగార్చడానికి లోంగోవాల్తో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్లోని కపుర్తలాకు గుంజుకపోయారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో కాజీపేట కోచ్ఫ్యాక్టరీ అంతర్భాగమైంది. 2009లో అప్పటి రైల్వేమంత్రి, ప్రస్తుత పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమను కాజీపేటలో ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించారు. దాన్ని 2011లో పశ్చిమబెంగాల్కు తరలించుకుపోయారు. కాజీపేట కోచ్ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాల్సిందేనని బీఆర్ఎస్, కాజీపేట, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమకారులు తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీకీ విజ్ఞప్తి చేశారు. ఇలా అనేకానేక ప్రయత్నాలు, పోరాటాల ఫలితంగా కాజీపేటలో కోచ్ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో కేంద్రం చట్టబద్ధమైన వాగ్దానం చేసింది.
గత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా గిరిజన యూనివర్సిటీ స్థాపన బిల్లును ప్రవేశపెడుతున్నామని కేంద్ర పార్లమెంట్ బులెటిన్ విడుదల చేసి చివరకి ఆ బిల్లు పెట్టకుండానే దాటవేసింది.
ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో ‘బయ్యారం ఉక్కు- తెలంగాణ హక్కు’గా నినదించి ఉద్యమించి చివరికి విభజన బిల్లులో స్థానం దక్కించుకున్న బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అటకెక్కింది. రాష్ట్ర విభజన బిల్లులో ఉన్న కాజీపేట కోచ్ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఈ మూడు ముఖ్యమైన అంశాలపై ఎటూ తేల్చకుండా ఉన్నపళంగా కాజీపేట కోచ్ఫ్యాక్టరీని తూచ్ అని వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ అదీ రూ.521 కోట్లతో ప్రారంభించి దశలవారీగా విస్తరించి.. విస్తరించి.. దాన్ని కోచ్ఫ్యాక్టరీగా ఉన్నతీకరిస్తాం అని కేంద్రం కొత్తరాగం ఆలపిస్తున్నది. ఇది వరంగల్కు వరం అని కొందరు, శాపం అని మరికొందరు. లేదు లేదు వంచన అని ఇంకొందరు అంటున్నారు. దీనికి కాలమే సమాధానం చెప్పాలి.
అలాగే వరంగల్లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు. ములుగు జిల్లా జాకారంలో గిరిజన విశ్వవిద్యాలయ స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం 336 ఎకరాల స్థలాన్ని ప్రతిపాదించింది. యూనివర్సీటీ పక్కా భవనాలు నిర్మించేదాకా తాత్కాలికంగా తరగతుల నిర్వహణ కోసం జాకారంలోని వైటీసీ (గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని యూత్ ట్రెయినింగ్ సెంటర్ను) భవన సముదాయాన్ని వినియోగించుకోవచ్చని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది.
– నూర శ్రీనివాస్ 91827 77011