న్యూఢిల్లీ, నవంబర్ 25: ఆర్థిక రంగం, సరిహద్దు భద్రతతో పాటు ప్రతి విషయంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి విమర్శించారు. పెగాసస్ గూఢచర్యం వ్యవహారంలో మోదీ సర్కారును ఆయన తప్పుట్టారు. అఫ్గానిస్థాన్ సంక్షోభం విషయంలో వ్యవహరించిన తీరు హాస్యాస్పదమని చురకంటించారు. మోదీ హయాంలో కశ్మీర్లో విషాదకర పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ‘మోదీ గవర్నమెంట్ రిపోర్ట్ కార్డ్’ శీర్షికతో ట్వీట్ చేశారు. ‘ఆర్థిక రంగం- విఫలం, సరిహద్దు భద్రత- విఫలం, విదేశీ విధానం- హాస్యాస్పద వైఫల్యం, దేశ భద్రత- పెగాసస్ ఎన్ఎస్వో, అంతర్గత భద్రత- కశ్మీర్ విషాద స్థితి, బాధ్యులు ఎవరు?’ అని ఆ ట్వీట్లో వ్యాఖ్యానించారు. బుధవారం పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీతో సుబ్రమణ్యస్వామి భేటీ అయ్యారు. ట్విట్టర్లో ఆమెపై ప్రశంసలు కురిపించారు. తాను కలిసి పనిచేసిన జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, చంద్రశేఖర్, పీవీ నరసింహారావు వంటి నాయకులతో మమతను పోల్చారు. వారేమనుకొన్నారో అదే చెబుతారని, ఇది భారత రాజకీయాల్లో అరుదైన లక్షణమని పేర్కొన్నారు. గతంలో కూడా పలుమార్లు మోదీ సర్కారు వైఫల్యాలను సుబ్రమణ్యస్వామి ఎండగట్టారు. ‘మన అణ్వాయుధానికి చైనా భయపడనప్పుడు చైనా అణ్వాయుధానికి మనమెందుకు భయపడటం?’ అని తాజాగా మంగళవారం ట్వీట్ చేశారు. దానికి ముందు రోజు ధరల పెరుగుదలపై ట్విట్టర్లో ఓ వ్యక్తి వ్యాఖ్యపై స్పందిస్తూ మోదీకి ఎకనామిక్స్ తెలియదని నిర్మొహమాటంగా చెప్పారు.