తెలంగాణ రాష్ట్రంపై కక్షకట్టారు
దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వ్యాఖ్య
నిజామాబాద్లో జీవన్రెడ్డికి ఘనస్వాగతం
నిజామాబాద్, ఫిబ్రవరి 17 : దేశ ప్రజలంతా మోదీ పాలనపై విసుగెత్తి పోయారని, ఇప్పుడు కేసీఆర్ నాయకత్వం కోసం దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పేదలు, రైతులకు అందుతున్న ప్రయోజనాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలంటే కేసీఆర్ ప్రధాని కావాలన్నారు. ఇప్పుడున్న నాయకత్వంతో దేశ పరువు మసకబారుతున్నదని చెప్పారు. నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమితులైన తరువాత తొలిసారి జిల్లాకు వచ్చిన ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డికి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, షకీల్ అహ్మద్, జడ్పీ చైర్మన్ విఠల్రావు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి నిజామాబాద్ సరిహద్దులో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నిజామాబాద్ నగరంలో టీఆర్ఎస్ కార్యకర్తలతో సభను నిర్వహించారు. దేశంలో ఆదర్శవంతమైన పరిపాలనతో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంపై ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్షా కడుపులో విషం పెట్టుకొని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మంత్రి వేముల విమర్శించారు. తెలంగాణపై ప్రధాని మోదీ పార్లమెంట్లో అవమానకరంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఈ ప్రాంత బీజేపీ ఎంపీలకు సిగ్గుంటే ప్రధానిని నిలదీయాలని డిమాండ్ చేశారు. తెలంగాణను ఆంధ్రాలో కలిపే ఆలోచన ప్రధాని మోదీకి ఉన్నట్టున్నదని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. ఎవరైనా కేసీఆర్ను, టీఆర్ఎస్ నాయకుల విషయంలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే వారి భరతం పడతామంటూ మంత్రి హెచ్చరించారు.
ఫేక్ అండ్ ఫ్రాడ్ ఎంపీ…
ధర్మపురి అర్వింద్ ఫేక్ అండ్ ఫ్రాడ్ ఎంపీ అంటూ టీఆర్ఎస్ నిజామాబాద్ నూతన అధ్యక్షుడు, ఎమ్మెల్యే జీవన్రెడ్డి మండిపడ్డారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన దొంగ ఎంపీ అని చెప్పారు. సీఎం కేసీఆర్పై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై నోరు పారేసుకునే వాళ్లను వదలొద్దని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సూచించగా… తప్పక సూచన పాటిస్తామంటూ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు దాదాపు 20 కిలో మీటర్ల మేర భారీగా ఘన స్వాగతం లభించిందని, వేలాది మంది జనం, 5 వేల కార్లు, 3 వేల బైక్లతో జరిగిన ర్యాలీని చూసి ప్రతిపక్ష పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో గిడ్డుంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఈగ గంగారెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.