హైదరాబాద్, ఫిబ్రవరి 2 : ప్రభు త్వ పాఠశాలల పిల్లలు తెలుగులో పద్యాలు పాడటం కామన్. అదే ఇంగ్లిష్లో పాడాలంటే కొంత కష్టపడాలి. అదే ఇంగ్లిష్లో సొంతంగా పద్యాలు రాయడం అంటే అద్భుతమే. అలాంటి అద్భుతమే సృష్టించారు నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు. పసిప్రాయంలోనే 24 మంది విద్యార్థులు ఇంగ్లిష్లో 72 పద్యాలను రాశారు. వాటిని ఒకదగ్గర చేర్చి, పుస్తకంగా ముద్రించారు. ఈ పుస్తకానికి ‘బ్లూమింగ్ బడ్స్’ పేరు పెట్టారు. ఈ పుస్తకాన్ని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి బుధవారం హైదరాబాద్లో విడుదల చేశారు. పద్య సంకలనాన్ని చదివిన మంత్రి విద్యార్థుల ప్రతిభను మెచ్చుకున్నారు.
సొంతంగా రాసే స్థాయికి..
నందిపేట మోడల్ స్కూల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 500 పైచిలుకు విద్యార్థులు చదువుతున్నారు. ఈ స్కూల్లోని పీజీటీ ఇంగ్లిష్గా పనిచేస్తున్న చంద్రశేఖర్ పెందోటి.. పిల్లలకు రోజుకు ఒక అసైన్మెంట్ ఇచ్చేవారు. ఒక రోజు పద్యాలు రాయమని చెప్ప గా, పలువురు విద్యార్థులు రాసుకొచ్చారు. ఆయా పద్యాలను చూసి అబ్బురపడ్డ చంద్రశేఖర్.. ప్రతిరోజు ఒక థీమ్ను ఎంపికచేసి పద్యాలు రాయమని ప్రోత్సహించేవారు. పిల్లలు రాసిన తర్వాత గ్రామర్తోపాటు తప్పొప్పులను దిద్దేవారు. ఇలా రెండేండ్లపాటు ప్రయత్నించిన ఫలితంగా పిల్లలు రాటుదేలారు. మూడేండ్లు ప్రయత్నించి పిల్లలు సొంతంగా పద్యాలు రాసే స్థాయికి ఎదిగారు. వాటిల్లో కొన్ని పద్యాలు వాయిసెస్ ఆఫ్ హ్యుమానిటీ, పీర్లెస్ పెరల్స్ వంటి జాతీయ, అంతర్జాతీయ పద్య సంకలనాల్లో ప్రచురితమయ్యాయి. ఆ విద్యార్థులంతా ఇప్పుడు ఎస్సెస్సీ పూర్తిచేసుకొని, ట్రిపుల్ ఐటీల్లో చదువుకుంటున్నట్టు చంద్రశేఖర్ తెలిపారు.