న్యూఢిల్లీ: మాజీ మోడల్ దివ్య పహుజా(Divya Pahuja) మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. హర్యానాలోని ఓ కాలువలో ఆమె మృతదేహన్ని గుర్తించారు. కొన్ని రోజుల క్రితం గురుగ్రామ్ హోటల్లో ఇద్దరు వ్యక్తులు ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హోటల్ ఓనర్ అభిజిత్ సింగ్, ప్రకాశ్, ఇంద్రజ్ ఆ హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆ ముగ్గుర్నీ గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు. సిటీ హోటల్ నుంచి దివ్య పహుజా మృతదేహన్ని తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి. ఆ విజువల్స్ ఆధారంగానే నిందితుల్ని అరెస్టు చేశారు.
గ్యాంగ్స్టర్ సందీప్ గడోలీ గర్ల్ఫ్రెండే దివ్య పహుజా. ముంబైలో జరిగిన వివాదాస్పద ఎన్కౌంటర్లో గ్యాంగ్స్టర్ సందీప్ హత్యకు గురయ్యాడు. అయితే ఆ కేసులో అరెస్టు అయిన మోడల్ దివ్య సుమారు ఆరేళ్ల 11 నెలల పాటు జైలుశిక్షను అనుభవించింది. ఆమె గత ఏడాది జూన్లో జైలు నుంచి రిలీజైంది. అరెస్టు అయిన సమయంలో పహుజా వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే.
మోడల్ దివ్య పహుజా మర్డర్ కేసులో బల్రాజ్, రవి బంగాను అరెస్టు చేసినట్లు గురుగ్రామ్ ఏసీపీ తెలిపారు. గురుగ్రామ్ నుంచి బెంగాల్కు వాళ్లు తప్పించుకున్నట్లు చెప్పారు. అయితే ఎందుకు మోడల్ దివ్యను హత్య చేశారో ఇంకా తెలియలేదు. దివ్యను హత్య చేసిన తర్వాత పంజాబ్లోని భాక్రా కెనాల్లో పడేశారు. అయితే ఆ మృతదేహం హర్యానాకు కొట్టుకువచ్చింది. అటాప్సీ కోసం మృతదేహన్ని పంపినట్లు పోలీసులు వెల్లడించారు.
జనవరి 2వ తేదీన హోటల్లో దివ్యను హత్య చేశారు. దివ్య మృతదేహాన్ని లాక్కెళ్లి కారులో ఎక్కించిన సీసీటీవీ విజువల్స్ దొరికాయి. 27 ఏళ్ల దివ్య పహుజాను అయిదు మంది ఆగంతకులు హోటల్కు తీసుకువెళ్లారు. అయితే తన వద్ద ఉన్న అసభ్యకర చిత్రాలతో హోటల్ ఓనర్ను దివ్య బెదిరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. మోడల్ దివ్య తలలో షూట్ చేశారు.