సిటీబ్యూరో, జనవరి 19(నమస్తే తెలంగాణ): మహా నగరంలో రోజురోజుకు పెంపుడు జంతువులపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో విదేశాల్లో మాదిరిగా ప్రతి ఒక్కరూ పెంపుడు జంతువుల పెంపకాన్ని హాబీగా మార్చుకుంటున్నారు. మరి కొందరు స్టేటస్ సింబల్గా పలు ఉన్నత జాతుల జంతువులను ముద్దుగా పెంచుకుంటున్నారు. ఇందుకు పెద్ద ఎత్తున ఖర్చు చేయడానికి కూడా వెనుకాడని వారున్నారు. ఇంకొందరు వాటిని కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు. వాటికి ఆహారం నుంచి, వైద్యం వరకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ పరిధిలో ఏటా ఎనిమిది నుంచి10వేల వరకు లైసెన్స్లు జారీ చేస్తున్నారు. పెంపుడు కుక్కలు పెంచుకునే వారి జాబితా రోజు రోజుకూ పెరుగుతుండటంతో జీహెచ్ఎంసీ లైసెన్స్ల జారీ ప్రక్రియను ఆన్లైన్ చేసింది. ఇందులో భాగంగానే తాజాగా వచ్చే నెల నుంచి పెంపుడు జంతువుల రిజిస్ట్రేషన్కు గాను మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ బుధవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మొబైల్ రిజిస్ట్రేషన్ పెట్ లవర్స్కు మరింత సౌకర్యార్థం ఉంటుందన్నారు.
కాగా, మై జీహెచ్ఎంసీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. పెట్డాగ్ లైసెన్స్ జారీకి సంబంధించి పైన పేర్కొన్న వివరాలతో సంబంధిత ఫారాన్ని భర్తీ చేసి అప్లోడ్ చేయాలి. ఏడాదికి గానూ లైసెన్స్ ఫీజు రూ.50లు చెల్లించాలి. రెన్యూవల్ కూడా ఇవే నిబంధనలతో ఆన్లైన్లో లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను www.ghmc online లో సంప్రదించవచ్చన్నారు.