ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 13 : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులందరికీ యూజీసీ 7వ వేతన సవరణ అమలు చేయాలని కాంట్రాక్ట్ అధ్యాపక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ కాంట్రాక్ట్ – తెలంగాణ స్టేట్ (యూటీఏసీ-టీఎస్), ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ (ఓయూ క్యాప్) సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయా సంఘాల అధ్యక్షులు డాక్టర్ ఎ.పరశురాం, డాక్టర్ డి.ధర్మతేజ మాట్లాడుతూ వర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఇప్పటి వరకు యూజీసీ 7వ వేతన సవరణ ఉత్తర్వులు విడుదల చేయలేదని, ఈ విషయంలో చొరవ తీసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడాలని ఎమ్మెల్సీని కోరారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ అధ్యాపక సంఘం నాయకులు డాక్టర్ ఆనంద్, డాక్టర్ భాగ్యమ్మ, డాక్టర్ ప్రేమయ్య, తదితరులు పాల్గొన్నారు.