సిరిసిల్ల: సిరిసిల్ల నియోజకవర్గంలోని అల్మాస్పూర్లో బాలికపై లైంగిక దాడి ఘటనలో నిందితుడిగా ఉన్న వ్యక్తిని టీఆర్ఎస్ తమ పార్టీ నుంచి బహిష్కరించింది. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఈ విషయాన్ని ప్రకటించారు. ఆల్మాస్ పూర్ ఘటన చాలా విచారకరమని, ఘటనకు బాధ్యుడైన వ్యక్తిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారన్నారు.
మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఆదేశాల మేరకు బాధ్యుడైన రాధరపు శంకర్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని, అర్బన్ మండల కన్వీనర్ పదవి నుంచి కూడా తొలగిస్తున్నామని ఎమ్మెల్సీ సారయ్య చెప్పారు. జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులను కలిసి నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని ఆయన చెప్పారు. ఇలాంటి సున్నితమైన ఘటనలపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం సరికాదన్నారు.
బాధిత కుటుంబానికి తాము అండగా నిలుస్తామని జడ్పీ ఛైర్ పర్సన్ న్యాలకొండ అరుణ చెప్పారు. చిన్నారిపై ఇలాంటి ఘటన జరుగడం బాధాకరమన్నారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ఆమె తెలిపారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య, జడ్పీటీసీ గుగులోతు కళావతి, మున్సిపల్ చైర్ పర్సన్ కళ తదితరులు పాల్గొన్నారు.