సికింద్రాబాద్, డిసెంబర్ 5: కంటోన్మెంట్ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు అందించే దిశగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు. ఇప్పటికే మడ్ఫోర్ట్, మారేడ్పల్లితో పాటు సిల్వర్ కంపౌండ్లో ఇండ్ల నిర్మాణాలు తది దశకు చేరుకున్నాయన్నారు. ఈ క్రమంలో రెండో వార్డు నారాయణ జోపుడి సంఘం బస్తీ వాసులు సుమారు వంద మంది ఆదివారం కార్ఖానాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని త్వరితగతిన తమ బస్తీలో డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించే విధంగా చొరవ తీసుకోవాలని సాయన్నను కలిసి విన్నవించారు. ఇతర ప్రాంతాల్లో ఏ మాదిరిగా ఇండ్లను నిర్మించారో అదేవిధంగా తమ ప్రాంతంలో ఇండ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే సాయన్న సంబంధిత అధికారులతో ఫోన్లో సంప్రదించారు.
త్వరలోనే ఇండ్ల నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల కాలంలోనే సిల్వర్ కంపౌండ్లో 56 డబుల్ ఇండ్లకు శంకుస్థాపన చేశామన్నారు. అవి అనతి కాలంలోనే ఇండ్లను పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సోమవారం అధికారులతో మరోసారి ప్రత్యేకంగా భేటీ అయి నారాయణ జోపుడి సంఘంలో ఇండ్ల నిర్మాణ అంశంపై మాట్లాడుతానని పేర్కొన్నారు. నారాయణ జోపుడి సంఘంలో సుమారు 280 ఇండ్ల నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పతి అంశాన్ని సవివరంగా తీసుకున్న తరువాతే బస్తీలో ఓ సమావేశం ఏర్పాటు చేసుకుందామని బస్తీవాసులకు చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, నేతలు నివేదిత, సదానంద్గౌడ్, మురళీయాదవ్, గౌస్, యూసుఫ్, సాయి చరణ్, జరీనా, కరీనా, యాదమ్మ, లక్ష్మి, వసంత, జయ తదితరులు పాల్గొన్నారు.