హైదరాబాద్ : బడుగు, బలహీన వర్గాలంటే ఈటలకు ఎలర్జీ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. సోమవారం ఆయన ఇల్లందకుంట మండల కేంద్రంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు సవాల్ విసురుతున్నాడని, పార్టీలో తమతో సమానంగా చూసిన వారిని సైతం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. మొన్న దళితబంధుపై విషం కక్కిండు.. ఇవాళ తనపై సైతం నోరుజాడారని.. ఇలాంటి నేతలను గెలిస్తే నిజంగా దళితులకు ఏమన్నా చేస్తడా అని ప్రశ్నించారు.
బడుగు, బలహీన వర్గాలంటేనే ఆయనకు ఎలర్జీ అని, ఇప్పుడు ఏదో ఓట్ల కోసం అందరినీ కలుసుకుంటూ తిరుగుతుండని.. గెలిస్తే మళ్లీ ఎలక్షన్ల దాకా ఎవరి మొహం చూడడన్నారు. నిరుపేదలందరికీ గూడు కల్పించాలనే సదుద్దేశంతో కేసీఆర్ నియోజకవర్గానికి 4వేల డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తే.. ఒక్క చోట సైతం గృహ ప్రవేశాలు చేయించని దద్దమ్మ ఈటల రాజేందర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాస్తులను కాపాడుకునేందుకు భావజాలాన్ని పక్కనపెట్టి బీజేపీలో చేరాడని, ఎంతో ఆదరించి మంత్రి పదవి ఇచ్చి గౌరవించిన సీఎం కేసీఆర్కే సున్నం పెట్టాలని చూసిన మోసకారి ఈటల అని విమర్శించారు. అధికార పార్టీలో మంత్రిగా ఉండి.. హుజూరాబాద్కు ఏం చేయలేని దద్దమ్మ.. ఇప్పుడే చేస్తడని ప్రశ్నించారు.
‘నీ బామ్మర్ది దళిత బిడ్డలను తిట్టింది చూశాం.. నీ కొడుకు భూమి కొరకు దళిత మహిళను బెదిరించింది విన్నాం. ఈ రోజు దళిత ఎమ్మెల్యేలను పరుష పదజాలంతో తిట్టింది చూశాం. వేల కోట్లు ఉన్నాయనే బలుపు, అహంకారంతో దళితులను తిడుతున్నావ్. నీ అహంకారానికి హుజూరాబాద్ దళిత బిడ్డలే నిన్ను బొంద పెడుతరు’ అన్నారు. ఈటల రాజేందర్ 2018లో టీఆర్ఎస్లో ఉండి.. చొప్పదండిలో తనను ఓడించడానికి ఎంత డబ్బులు తీసుకున్నావ్ అని సుంకె రవిశంకర్ ప్రశ్నించారు. ఆయన భాగోతం మొత్తం కేసీఆర్కు అర్థమయ్యిందని, అందుకే పార్టీ నుంచి బయటకు పంపాడన్నారు. కన్న తల్లిలాంటి పార్టీని మోసం చేశాడని, రేపు బీజేపీని కూడా నాశనం చేస్తాడన్నారు. అందుకే ఆయనకు బీజేపీ సపోర్ట్ లేదని, దళితులను తిట్టిన ఆయన నాశనమై పోతాడన్నారు.