కేపీహెచ్బీ కాలనీ, మార్చి 20 : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పదేండ్ల కాలంలో రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని, పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్(BRS )పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి భారీ మెజారిటీని అందించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao), ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్ కోరారు.
బుధవారం కూకట్పల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్ధతుగా నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చెందిందన్నారు.
తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరం ఆదర్శవంతంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందాయన్నారు. గత ఎన్నికలలో కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రజలందరూ ఏకపక్షంగా తీర్పునిచ్చి బీఆర్ఎస్ పార్టీకి 70 వేలకు పైగా మెజార్టీని అందించారని, రానున్న ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ పార్టీని ఆదరించి భారీ మెజార్టీని అందించాలని కోరారు. కాలనీలు, బస్తీలలో ప్రజలను కలుస్తూ కారు గుర్తుకు ఓటేసేలా ప్రచారం చేయాలన్నారు.