దుండిగల్/కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 3: ఆర్థికంగా ఎదుగుదలకు నోచుకోని, దారిద్య్ర రేఖకు దిగువనున్న ఎస్సీ కుటుంబాలకు చేయూతను అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం యావత్ దేశానికే ఆదర్శవంతంగా నిలుస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి విడతల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్న నేపథ్యంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను “నమస్తే తెలంగాణ” ముచ్చటించింది. దీనిపై ఆయన స్పందిస్తూ ఎన్నో ఏళ్లుగా వెనకబడిన కులాలు ఆర్ధికంగా ఎదగలేక, కుటుంబాలను పోషించుకోవడానికే పరిమితమవుతున్నాయని, అలాంటి కుటుంబాల ఆర్థికాభివృద్ధికి చేయూతనిస్తూ, వారు ఆర్ధికంగా ఎదగాలన్న ఆకాంక్షతో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించనున్నది.
అలా అందించిన ప్రభుత్వ సహకారంతో 30 రకాల వివిధ వ్యాపారాలను చేసుకొని జీవితంలో ఎదగాలనే సంకల్పంతో తోడ్పాటును అందించేందుకు తగు చర్యలు తీసుకుంటుందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ తన మాటను నిలబెట్టుకొని ప్రస్తుతం, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో మొదటి దశగా వంద మంది కుటుంబాలను ఎంపిక చేసే ప్రక్రియను చేపడుతుందన్నారు.
నియోజకవర్గం పరిధిలోని దళితులందరికి ఈ దళిత బంధు పథకాన్ని వర్తింపజేయడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్పష్టం చేశారు. దళితులను ధనవంతులుగా మార్చేందుకే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. తొలి విడతగా నియోజకవర్గం నుంచి వంద మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి లబ్ధిదారులకు సంబంధించిన జీవన స్థితిగతులపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
మొదటగా నియోజకవర్గం పరిధిలోని గాజుల రామారం లాల్సాబ్గూడ, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మహేశ్వరంలోని దళితులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామన్నారు. దశల వారీగా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న దళితులకు ఈ పథకాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో ఎవరు ఆపోహాలు, ఆందోళనకు గురికావొద్దన్నారు. రాజకీయాలకు అతీతంగా పథకాన్ని వర్తింపజేస్తామని నియోజకవర్గంలో మరిన్ని సందేహాలను ఆయన నివృత్తి చేశారు.
దళిత బంధు పథకాన్ని ఏ విధంగా భావిస్తున్నారు?
ఎమ్మెల్యే వివేకానంద్: ఈ పథకం దళితులకు ఒక వరం. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న దళిత కుటుంబాలను ఆదుకొని వారిని ధనవంతులుగా మార్చేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని రూపొందించారు. దళిత బంధు పథకంలో ఎంపికైన లబ్ధిదారులకు వారి ఖాతాలలో నేరుగా రూ.10 లక్షలను జమ చేసి వ్యాపారాలను ఏర్పాటు చేసుకునేలా తోడ్పాటును అందిస్తుందన్నారు. దీని ద్వారా ఆర్ధికంగా నిలదొక్కుకోవడమే ఈ పథకం ముఖ్య ఉద్ధేశం. ఒక రకంగా చెప్పాలంటే దళిత బంధు పథకం..దళితులకు సీఎం ఇచ్చిన గొప్ప వరంగా చెప్పుకోవచ్చు.
నియోజకవర్గంలో ఎంతమందికి ఇస్తున్నారు?
ఎమ్మెల్యే వివేకానంద్: దళిత బంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలోని వందమందికి వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ధేశించింది. అందులో భాగంగా తొలి దఫాగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వంద మంది దళిత కుటుంబాలకు ఈ ఫథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున అందజేయనున్నాం. ఈ నెల 7వ తేది నుంచి ఎంపిక చేసిన లబ్ధిదారుల ఖాతాలలో ప్రభుత్వం నిధులను జమ చేయనుంది.
ఏయే ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేశారు?
ఎమ్మెల్యే వివేకానంద్: నియోజకవర్గం పరిధిలో తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి కటిక దారిద్య్రాన్ని అనుభవిస్తున్న దళిత కుటుంబాలకు ఈ పథకానికి ఎంపిక చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారుల విచారణ సైతం పూర్తయ్యింది. ముందుగా గాజుల రామారం సర్కిల్ పరిధిలోని లాల్సాబ్గూడ వాసులు, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మహేశ్వరానికి చెందిన దళితులకు ఈ పథకానికి ఎంపిక చేయడం జరిగింది.