గోల్నాక, డిసెంబర్ 14: రోడ్డు విస్తరణలో భాగంగా వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. నల్లకుంట ఫీవర్ దవాఖాన లైన్ రోడ్డు విస్తరణలో భాగంగా పక్కనే ఉన్న దుకాణాల సముదాయాల యజమానులకు అధికారులు నోటీసులు పంపించిన నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఫీవర్ దవాఖాన చౌరస్తా వద్ద వ్యాపారులతో సమావేశమయ్యారు. రోడ్డు విస్తరణలో తమ దుకాణాలను తొలగిస్తే తాము ఉపాధి కోల్పోతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 1997లో రోడ్డు విస్తరణలో సగానికి పైగా స్థలం కోల్పోయామని ఎమ్మెల్యేకు తెలిపారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో అప్పులు చేసి వ్యాపారాలు చేస్తూ చాలీచాలని జీవనం గడుపుతున్నామని వాపోయారు. తమ దుకాణాలు కూల్చివేస్తే రోడ్డున పడతామని వ్యాపారులు విన్నవించుకున్నారు. అధికారులతో మాట్లాడి.. వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ అధికారులు శ్వేత, నరేందర్ పాల్గొన్నారు.
గోల్నాక: నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మంగళవారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్తో కలసి ఆయన జలమండలి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలోని పలు ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న వరదనీటి పైప్లైన్లు, తాగునీటి పైప్లైన్లు, డ్రైనేజీ పైప్లైన్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు అంచనాలు రూపొందించాలన్నారు. అదే విధంగా నా లుగు రోజులుగా తాగునీటి సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తూ కలుషిత నీటి సమస్యతో పాటు లోఫ్రెషర్ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. జలమండలి డీజీఎంలు సన్యాసిరావు, సతీశ్, ఏఈలు కుషాల్, షకీర్ పాల్గొన్నారు.